Bandi Sanjay Kumar: క్రీడా రంగంలో రాణించాలనుకుంటున్న ఉత్తర తెలంగాణ యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో (Jammikunta) అత్యాధునిక క్రీడా సదుపాయం ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఖేలో ఇండియా’ (Khelo India) పథకం కింద జమ్మికుంటలో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణానికి ఆమోదం లభించింది.
ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఏకంగా ₹6.5 కోట్లను మంజూరు చేసింది. ప్రపంచ అథ్లెటిక్స్ ప్రమాణాలకు (World Athletics Standards) అనుగుణంగా 400 మీటర్ల పొడవు, 4 లైన్లతో కూడిన ఈ సింథటిక్ ట్రాక్ను నిర్మించనున్నారు. సాధారణంగా హైదరాబాద్ వంటి మహానగరాలకే పరిమితమైన ఇలాంటి హై-క్వాలిటీ సింథటిక్ ట్రాక్లు, ఇప్పుడు జమ్మికుంట వంటి మున్సిపాలిటీకి రావడం నిజంగా విశేషం. మట్టి ట్రాక్లపై సాధన చేయడం వల్ల గాయాల పాలవుతున్న క్రీడాకారులకు ఈ సింథటిక్ ట్రాక్ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ సదుపాయాలు కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు. “గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఉన్నారు. కానీ, వారికి సరైన మౌలిక సదుపాయాలు లేక వెనుకబడిపోతున్నారు. ఈ కొత్త ట్రాక్ వారి కలలకు రెక్కలు తొడుగుతుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటేందుకు జమ్మికుంట ఇక కొత్త వేదికగా మారుతుంది.” అని ఆయన పేర్కొన్నారు.
క్రీడలను కేవలం నగరాలకే పరిమితం చేయకుండా, గ్రామ స్థాయికి చేర్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సంకల్పానికి జమ్మికుంట ప్రాజెక్టు ప్రత్యక్ష ఉదాహరణ అని బండి సంజయ్ అభివర్ణించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు, పరిసర ప్రాంతాల్లో గ్రామీణ క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ వంటి పోటీల్లో పాల్గొనే ఛాంపియన్లను తయారుచేయడమే తమ నిబద్ధత అని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పట్ల స్థానిక క్రీడా సంఘాలు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Kurchi Thatha Death News :నన్ను బ్రతికి ఉండగానే చంపేశారు కదరా… కుర్చీ తాత ఫైర్