నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయం గురువారం రణరంగంగా మారింది. కొత్తగా గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం వేదికగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, సీనియర్ నాయకుడు పిల్లి రామరాజు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు చివరకు బాహాబాహీకి దారితీశాయి. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పార్టీ కార్యాలయంలోనే నేతలు ఇలా కొట్టుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
గౌరవ సన్మానంలో ఘర్షణ
ఇటీవల ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించేందుకు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమం జరుగుతుండగానే నాగం వర్షిత్ రెడ్డి, పిల్లి రామరాజు అనుచరుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఇది కాస్తా ముదిరి ఒకరినొకరు నెట్టుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకునే స్థాయికి చేరింది. ఈ క్రమంలో నాగం వర్షిత్ రెడ్డి అనుచరుడు ఒకరు తన మొహంపై గుద్దాడని.. ఆ వ్యక్తితో తన కాళ్లు పట్టించి క్షమాపణలు చెప్పించాలని రామరాజు అనుచరుడు డిమాండ్ చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.
సవాల్ విసురుకున్న నేతలు
ఘర్షణ సమయంలో నాయకుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పిల్లి రామరాజు వర్గీయులు జిల్లా అధ్యక్షుడి తీరుపై విరుచుకుపడ్డారు. ‘వానికి దమ్ముంటే 6వ వార్డులో గెలిచి చూపించమని చెప్పు’ అంటూ వర్షిత్ రెడ్డిని ఉద్దేశించి బహిరంగంగానే సవాల్ విసిరారు. సొంత పార్టీ కార్యాలయంలోనే కొత్తగా గెలిచిన ప్రజాప్రతినిధుల ముందే ఇలాంటి అసభ్యకర ప్రవర్తన చూసి సర్పంచులు విస్మయానికి గురయ్యారు.
మీడియాపై దాడి.. వీడియోల డిలీట్
ఈ గొడవను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై నాగం వర్షిత్ రెడ్డి వర్గీయులు దాడికి తెగబడ్డారు. పార్టీ పరువు పోతుందన్న నెపంతో విలేకరుల ఫోన్లను లాక్కుని, రికార్డ్ చేసిన వీడియోలను బలవంతంగా డిలీట్ చేయించారు. మీడియా స్వేచ్ఛను హరించడమే కాకుండా, విలేకరుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో జిల్లా మీడియా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అంతర్గత విభేదాలను మీడియాపై చూపించడంపై జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి.
ఈ ఘటనతో నల్గొండ బీజేపీలోని వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. ఈ రసాభాసపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.