Chinese Manja: సంక్రాంతి పండుగ ఇంకా రాకముందే నగరంలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. నిషేధిత ‘చైనా మాంజా’ వాహనదారుల పాలిట యమపాశంగా మారుతోంది. సరదా కోసం ఎగురవేస్తున్న గాలిపటాలు.. అమాయకుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఆదివారం హైదరాబాద్లో వేర్వేరు చోట్ల జరిగిన రెండు ఘటనల్లో యువకులు తీవ్రంగా గాయపడటం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.
పాతబస్తీ షాలిబండా పరిధిలోని షంషీర్గంజ్ రోడ్డుపై ఆదివారం సాయంత్రం జమీల్ అనే ఇంటర్ విద్యార్థి బైక్పై వెళ్తుండగా మాంజా మెడకు తగిలింది. దీంతో అదుపుతప్పి కిందపడిపోగా.. గొంతు కోసుకుపోవడంతో పాటు మెడ, ముఖం, చేతులకు గాయాలయ్యాయి. దక్షిణ మండలం డీసీపీ కిరణ్ కారే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మొన్నటికి మొన్న కీసరలోని మల్లికార్జున నగర్లో చైనా మాంజా సృష్టించిన బీభత్సం మనకు తెలిసిందే. జశ్వంత్ రెడ్డి అనే యువకుడు బైక్పై వెళ్తుండగా, గాలిలో ఎగురుతూ వచ్చిన నైలాన్ మాంజా మెడకు చుట్టుకోవడంతో గొంతు భాగం తీవ్రంగా తెగిపోయింది. గాయం లోతుగా ఉండటంతో వైద్యులు అతడికి ఏకంగా 19 కుట్లు వేయాల్సి వచ్చింది. దారం ఇంకొంచెం లోతుగా దిగి ఉంటే ప్రాణానికే ముప్పు వాటిల్లేదని వైద్యులు ధృవీకరించిన ఈ ఘటన.. చైనా మాంజా తీవ్రతకు అద్దం పడుతోంది.
చైనా మాంజా అమ్మకం, వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ వ్యాపారులు దొంగచాటుగా విక్రయిస్తున్నారని, ఇది చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేశామన్నారు. పండుగ వేళ తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ దారం వాడుతున్నారో గమనించాలని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Also: CM Revanth Reddy Chit Chat: ఆ విషయాలు కేసీఆర్ని అడగండి.. మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్