Telangana North East Connect: “తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్” టెక్నో-కల్చరల్ ఫెస్టివల్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఘన స్వాగతం పలుకుతూ, వారి కోసం ఒక చారిత్రాత్మక వరాన్ని ప్రకటించారు. హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకలో సీఎం మాట్లాడుతూ, తెలంగాణకు మరియు ఈశాన్య రాష్ట్రాలకు మధ్య ఉన్న ఐక్యతా స్ఫూర్తిని ఈ ఉత్సవం చాటిచెబుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈశాన్య భారతం అద్భుతమైన పర్యావరణ సంపదతో పాటు గొప్ప సాంస్కృతిక చైతన్యం కలిగిన ప్రాంతమని, అయితే అక్కడ వెలుగులోకి రాని అంశాలు ఇంకా చాలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రాంతీయ గుర్తింపు విషయంలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు పడుతున్న ఆవేదనను తెలుగు ప్రజలు చాలా సులభంగా అర్థం చేసుకోగలరని సీఎం గుర్తు చేశారు. 1970, 80వ దశకాల్లో ఉత్తరాది వారు దక్షిణాది వారందరినీ భాష, సంస్కృతులతో సంబంధం లేకుండా ‘మద్రాసీలు’ అని పిలిచేవారని, అప్పట్లో తెలుగువారికంటూ ప్రత్యేక గుర్తింపు ఉండేది కాదని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆనాడు వివక్ష ఎదుర్కొన్న దక్షిణాది రాష్ట్రాలే నేడు దేశ ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని, అదే స్ఫూర్తితో ఈశాన్య రాష్ట్రాలను కూడా మనం అర్థం చేసుకోవాలని, వారితో అనుబంధాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ నగరంలో ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారంతా సాఫ్ట్వేర్, ఫార్మా, హెల్త్కేర్, టూరిజం, హాస్పిటాలిటీ, క్రీడలు వంటి రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశంసించారు. తెలంగాణ సమాజంతో మమేకమై ఇక్కడ అభివృద్ధికి తోడ్పడుతున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, తెలంగాణను తమ రెండో ఇల్లు (Second Home) గా భావించవచ్చని భరోసా ఇచ్చారు. ఈ ఆత్మీయతను మరింత బలోపేతం చేసే దిశగా సీఎం ఒక భారీ ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో దేశంలోనే మొట్టమొదటిసారిగా ‘నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని’ (North East Allied Centre) ఏర్పాటు చేయడానికి భూమిని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ నార్త్ ఈస్ట్ హబ్లో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలు తమ సొంత భవనాలను నిర్మించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేవలం భవనాలే కాకుండా, అక్కడ ఆయా రాష్ట్రాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం, వారి సంప్రదాయ వంటకాలు, చేతివృత్తులు, కళలు మరియు సంస్కృతులను ప్రదర్శించడానికి ప్రత్యేక వేదికలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ బిడ్డ త్రిపుర గవర్నర్గా, త్రిపుర బిడ్డ తెలంగాణ గవర్నర్గా సేవలు అందిస్తుండటం మన రెండు ప్రాంతాల మధ్య ఉన్న బంధానికి నిదర్శనమని అన్నారు. “తెలంగాణ రైజింగ్ విజన్ 2047” లక్ష్యాలను దేశవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఈశాన్య రాష్ట్రాల సహకారం కూడా ఉండాలని కోరుతూ, ఈ ఫెస్టివల్ విజయవంతం చేసిన నిర్వాహకులకు సీఎం అభినందనలు తెలిపారు.
Read Also: Raja singh: రాజమౌళి సినిమాలను బహిష్కరించండి.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు