CM Revanth Reddy: “ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. దేశానికి దిశానిర్దేశం చేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మొదలుకొని, మలి తెలంగాణ ఉద్యమంలో వ్యూహకర్తగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ వరకు అందరూ ఈ గడ్డ బిడ్డలేనని గర్వంగా చెబుతున్నా.” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్లో నిర్వహించిన ప్రజాపాలన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, జిల్లా అభివృద్ధి, సింగరేణి కార్మికుల సంక్షేమంపై కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ ఉద్యమాల్లో కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల పాత్రను గుర్తుచేస్తూ, కాళోజీ ఆవేశం మనకు ఎల్లప్పుడూ ఆదర్శమని కొనియాడారు.
జిల్లా పునర్వ్యవస్థీకరణపై జరుగుతున్న ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారనే వార్తల్లో వాస్తవం లేదని, అది కేవలం కొందరు చేస్తున్న దుష్ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. పాత జిల్లాల తొలగింపు లేదా కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ భవిష్యత్తులో అటువంటి ఆలోచన ఉంటే చట్టబద్ధంగానే ముందుకు వెళ్తామని భరోసా ఇచ్చారు. భూపాలపల్లి జిల్లాను తొలగించే ప్రసక్తే లేదని, అపోహలు సృష్టించే వారిని ప్రజలు గమనించాలని సూచించారు.
సింగరేణి కార్మికుల కష్టాన్ని, త్యాగాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సింగరేణి కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి లోకానికి వెలుగులు పంచుతున్నారని, వారి పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గుర్తుచేశారు. సింగరేణి మెడికల్ బోర్డు రద్దు ఆలోచన తమ పరిశీలనలో లేదని, కార్మికులను నష్టపరిచే ఏ నిర్ణయమూ తీసుకోబోమని హామీ ఇచ్చారు. అలాగే, 215 మంది డిస్మిస్డ్ కార్మికుల విషయంలో త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని, ఈ ప్రభుత్వం కార్మికుల కోసమే పని చేస్తుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ పునాది వేసిన భూపాలపల్లి నేడు జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందడం గర్వకారణమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
Read Also: Harish Rao: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వంపై హరీష్ రావు సెటైర్లు.. ఏమన్నారంటే..!