రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. మీటింగ్ ఏదైనా, పొలిటికల్ కార్యక్రమంలోనూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదేండ్లు అధికారంలో ఉంటుందని పదే పదే నొక్కి చెబుతున్నారు. అందుకు ఉదాహరణలను కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. వైఎస్సార్ హయాంలో పదేండ్లు కాంగ్రెస్..కేసీఆర్ హయాంలో పదేండ్లు బీఆర్ఎస్.. ఇప్పుడు తన హయాంలోనూ పదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ ప్రజలు పదేండ్లు ఒక పార్టీకి అధికారం ఇస్తున్నారని గుర్తుచేస్తున్నారు. అయితే, అధికారం అనేది అంత సులువుగా రాదని ఆయనకు కూడా తెలుసు. అందుకే టార్గెట్ 2029 ఎన్నికలే లక్ష్యంగా సీఎం రేవంత్ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
2029లో జమిలి ఎన్నికలు జరగనున్నాయి. దానికి ఆరు నెలల ముందే తెలంగాణ ప్రభుత్వం పీరియడ్ ముగియనుంది. మరో ఆరునెలల పాటు ప్రభుత్వం నడపటానికి కేంద్రం గవర్నర్ ద్వారా అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. అపద్ధర్మ సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని తెలుస్తున్నది. వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి సీఎంగా ప్రమాణం చేసేందుకు రేవంత్ రెడ్డి ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఈ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధికి లోటు లేకుండా పాలన సాగించి వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వ్యూహరచన సైతం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది.ఇక గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతిని ముందుగా ప్రజల్లోకి తీసుకెళ్లి తమ ప్రభుత్వం అవినీతిపరులు, అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించిందని ప్రజలకు చూపించాలని సైతం ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో అప్పులు తగ్గించేందుకు, మరల కొత్త అప్పులు చేయకుండా ఉన్నవాటిని తగ్గించి.. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో పెట్టుబడులు పెద్దఎత్తున ఆకర్షించాలని సీఎం రేవంత్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దీనికి తోడు ప్రభుత్వ బడులను ప్రయివేటుకు దీటుగా తీర్చిదిద్ది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో పొల్యూషన్ ఎక్కువ అవుతున్నందున నగరంలోని కంపెనీలు, పరిశ్రమలను రీజినల్ రింగ్ రోడ్డు పరిధిలోకి తరలించి పర్యావరణ పరిరక్షణకు సైతం ప్రభుత్వం సంకల్పం తీసుకుంది.రాష్ట్రంలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. వారికి సకాలంలో సంక్షేమం, మహిళా రుణాలను అందించేందుకు సర్కారు నడుం బిగించింది.
BRS : బీఆర్ఎస్ కాదు… బీజేపీ vs కాంగ్రెస్!
వచ్చే ఎన్నికలకు ఒక ఏడాది ముందే ఇప్పుడున్న మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, పార్టీకి నేతలు ప్రజల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేయాలని సీఎం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏడాది ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం, మరోసారి అధికారమిస్తే ఏం చేయదలుచుకుంటున్నామో పక్కాగా ప్లాన్ చేసి ఓటర్లకు వివరించాలని సీఎం ముందే అన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకోసం ఓ టీం పనిచేస్తున్నదని సమాచారం.ఇక ప్రతిపక్షాలు చేసే విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని మంత్రులకు ఆదేశాలు ఇప్పటికే వెళ్లినట్టు తెలుస్తున్నది.అలాగే మైనార్టీ ఓట్లు చీలకుండా వారికోసం ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.జమిలి ఎన్నికలు కేంద్రంలోని ప్రభుత్వానికి కలిసి వస్తాయని విశ్లేషకులు చెబుతుండగా.. ఎలాగైనా 2029లో అధికారంలోకి వచ్చి మరోసారి సీఎంగా ప్రమాణం చేయాలని రేవంత్ రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తున్నది.