సీఎం రేవంత్ రెడ్డి సోమవారం తన మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులకు దిశానిర్దేశం చేసిన సీఎం, రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ ప్రస్తుతం తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉందని.. ఈ తరుణంలో ప్రభుత్వంపై వారు చేసే విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
నీటి వాటాలపై అప్రమత్తత అవసరం
రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత కీలకమైన నీటి వాటాల విషయంలో మంత్రులందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగడుతూనే.. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను స్పష్టంగా వివరించాలని సూచించారు. సభలో మంత్రుల అటెండెన్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, ప్రతి అంశంపై పూర్తి అవగాహనతో సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
విపక్షాలపై అటాకింగ్ వ్యూహం
సభలో ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా జిల్లాల వారీగా పెండింగ్లో ఉన్న సమస్యలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై మంత్రులు అటాకింగ్ మూడ్లోకి వెళ్లాలని ఆదేశించారు. ‘పాయింట్ ఆఫ్ ఆర్డర్’ వంటి సభా నియమాలను ఉపయోగించుకుంటూ.. ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇవ్వడమే కాకుండా.. వారు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పారు.
మంత్రులకు దిశా నిర్దేశం..
అసెంబ్లీ సమావేశాల పొడిగింపు లేదా తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 4వ తేదీన మళ్ళీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ లోపు మంత్రులు తమ తమ శాఖలపై పూర్తి సమాచారంతో ఉండాలని, ప్రజల్లోకి ప్రభుత్వ సందేశాన్ని బలంగా తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
ALSO READ: AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్