సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నిర్మల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని మామడ మండలం పోన్కల గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన సదర్మట్ బ్యారేజీని సీఎం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందనుంది.
ఘనస్వాగతం పలికిన మంత్రులు, ప్రజాప్రతినిధులు
అంతకుముందు.. హెలికాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకున్న సీఎంకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్టు మ్యాపులు, ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా బ్యారేజీ నిర్మాణ క్రమం, నీటి నిల్వ సామర్థ్యం, ఆయకట్టు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలను సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
బహిరంగ సభకు తరలిన ముఖ్యమంత్రి
బ్యారేజీ ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్లో నిర్మల్ జిల్లా కేంద్రానికి బయలుదేరారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉండటంతో ఈ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ యంత్రాంగం, పెద్ద ఎత్తున రైతులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.