తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు పలు కీలక ప్రశ్నలు సంధించింది. ప్రభాకర్ రావు ఇంటరాగేషన్ను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ఆయనకు ఉన్న మధ్యంతర రక్షణను పొడిగించింది.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ప్రభాకర్ రావు విచారణను ఇంకెంత కాలం కొనసాగిస్తారు..? కేసులో ఇంకా మిగిలి ఉన్న అంశాలేమిటి..? అని ధర్మాసనం ప్రశ్నించింది. గత మే నెల నుంచే ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించామని.. ఇప్పటికే రెండు వారాల పాటు కస్టడీకి అనుమతించిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. దర్యాప్తు సంస్థల ఉద్దేశం నెరవేరిందా..? లేదా..? అని నిలదీసింది.
విచారణ సందర్భంగా కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. ‘ప్రభాకర్ రావును మళ్లీ జైలులో పెట్టాలనుకుంటున్నారా?’ అని ప్రశ్నించింది. ఆర్టికల్ 142 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి, కేసు దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని తాము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశామని స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ లేదా రక్షణ కల్పించినంత మాత్రాన నిందితుడిని పిలవకూడదని అర్థం కాదని, అవసరమైనప్పుడు మళ్లీ పిలిచి విచారించే స్వేచ్ఛ దర్యాప్తు సంస్థలకు ఉంటుందని కోర్టు పేర్కొంది. ప్రభాకర్ రావు దర్యాప్తుకు సహకరిస్తారని ధర్మాసనం విశ్వాసం వ్యక్తం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా తన వాదనలను వినిపించారు. ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్కు అసలు విచారణార్హత ఉందా..? లేదా..? అనే అంశాన్ని ఆయన లేవనెత్తారు. ‘కస్టడీలో పెట్టాల్సిన వ్యక్తికి ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారు?’ అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు అవసరమని.. నిందితుడు కీలక సమాచారాన్ని దాచిపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు.
ఉభయ పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు, ప్రభాకర్ రావుకు అరెస్టు నుంచి ఉన్న మధ్యంతర రక్షణను తదుపరి విచారణ వరకు పొడిగించింది. ఇంటరాగేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశిస్తూ.. కేసును మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ లోపు దర్యాప్తులో సాధించిన పురోగతిని వివరించాలని సూచించింది.
ALSO READ: BRS : బీఆర్ఎస్ ఆశలు గల్లంతు… ఇదే చిట్టచివరి ఛాన్స్!