S. Janaki passes away: దక్షిణ భారత చలనచిత్ర సంగీత సామ్రాజ్ఞి, గానకోకిల ఎస్. జానకి మరణవార్త సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దశాబ్దాల పాటు తన అమృత గానంతో కోట్లాది మంది శ్రోతలను మైమరిపించిన జానకమ్మ విడిచివెళ్లడం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆమె మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
చెరగని ముద్ర వేసిన గళమాధుర్యం
దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో జానకి తన అద్భుత గళమాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. వైవిధ్యమైన హావభావాలను కేవలం తన గొంతుతోనే పలికించగల అరుదైన ప్రతిభ ఆమె సొంతమన్నారు. అనేక చిత్రాల్లో పాత్రల స్వభావానికి, సన్నివేశాలకు అనుగుణంగా నవరసాలను పలికిస్తూ ఆమె ఎన్నో పాటలు పాడారని గుర్తుచేసుకున్నారు.
తెలుగు వారి గర్వకారణం
అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న జానకమ్మ తెలుగు నేలపై జన్మించడం, మన తెలుగు వారు కావడం తెలుగు ప్రజలందరికీ ఎంతో గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు మొత్తం 17 భాషల్లో ఆమె దాదాపు 50 వేలకు పైగా పాటలు పాడటం సాధారణ విషయం కాదని, ఇది ఆమె అకుంఠిత సాధనకు నిదర్శనమని అన్నారు. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో ప్రతిష్టాత్మక జాతీయ, ప్రాంతీయ పురస్కారాలను అందుకున్నారని తెలిపారు.
కోట్లాది అభిమానులకు తీరని లోటు
జానకమ్మ మరణం కేవలం భారతీయ చలన చిత్ర పరిశ్రమకే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సంగీతాభిమానులకు కోలుకోలేని దెబ్బ అని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు ఆమె ఆత్మకు సద్గతులు ప్రసాదించాలని ప్రార్థిస్తూ, శోకతప్త హృదయంతో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని, ధైర్యాన్ని తెలియజేశారు.
Also Read: అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!