Singareni Yatra: స్వేచ్చ బ్యూరో: సింగరేణి బొగ్గు గని కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 13, 14 తేదీల్లో ‘సింగరేణి భరోసా యాత్ర’ను నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కార్మికుల క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా తెలుసుకోవడంతో పాటు, వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి భరోసా కల్పించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం. రెండు రోజుల పాటు సాగే ఈ ప్రతిష్టాత్మక యాత్ర సింగరేణి వ్యాప్తంగా ఉన్న ప్రధాన ప్రాంతాలను కవర్ చేయనుంది. కొత్తగూడెం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నారు.
అలాగే ఐదు ముఖ్యమైన కేంద్రాల్లో కార్మికులతో నేరుగా ముఖాముఖి, గేట్ మీటింగులు, ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. కార్మికులు తమ వినతులు, సమస్యలను నేరుగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ వేదికలు ఉపయోగపడనున్నాయి. ఈ భరోసా యాత్రను పార్టీ పరంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు ఈ యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. సింగరేణి కార్మిక లోకంలో ధైర్యం నింపేందుకు, వారి హక్కుల సాధనలో బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుందని చాటిచెప్పేందుకే ఈ యాత్రను డిజైన్ చేసినట్లు నాయకులు పేర్కొంటున్నారు. ఈ పర్యటన సింగరేణి ప్రాంతంలో రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.
Also read: Nerella Incident: నేరెళ్ల థర్డ్ డిగ్రీ బాధితుడు.. గంధం గోపాల్ కన్నుమూత!
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10 గంటలకు కొత్తగూడెం చేరుకుంటారు. అక్కడ హాల్ మీటింగ్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం మణుగూరుకు చేరుకుంటారు. మణుగూరు పీకే ఓసీ-2 గనిని సందర్శించి, అక్కడ కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు భూపాలపల్లి చేరుకుని, అక్కడ ఏర్పాటు చేసిన హాల్ మీటింగ్లో పాల్గొంటారు.
రాత్రికి భూపాలపల్లిలోనే బస చేస్తారు. రెండో రోజు మంగళవారం ఉదయం 7 గంటలకు భూపాలపల్లి కేటీకే-8 మైన్ను సందర్శించి కార్మికులతో భేటీ అవుతారు. అనంతరం 9 గంటలకు తాడిచర్ల గనులకు చేరుకుంటారు. అక్కడి నుంచి రామగుండం చేరుకుని జీడీకే-ఓసీ గని కార్మికులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం మందమర్రి ఎస్ఆర్పీ-3 గనిని సందర్శించి, మధ్యాహ్నం 3.15 గంటలకు చెన్నూర్ నియోజకవర్గంలోని కైతనపల్లిలో జరిగే హాల్ మీటింగ్లో పాల్గొంటారు. పర్యటన ముగించుకుని రాత్రి 8 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ యాత్రకు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీ రఘునాథ్ రావు వ్యవహరిస్తున్నారు.
Also Read: Krishna Basin: తెలంగాణ రైతులకు బిగ్ అప్డేట్.. రెండు తెలుగు రాష్ట్రాలకు నీళ్లు వచ్చేది అప్పుడే..?