Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ అంశం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. గురుదక్షిణ కోసమే ఏపీకి తెలంగాణ జలాలు ధారాదత్తం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత హరీష్రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ఘాటుగా స్పందించారు. నిజంగా అన్నం తినేవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 టీఎంసీలు తరలిస్తున్నప్పుడు హరీష్రావు గాడిదలు కాస్తున్నాడా అని, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నది నువ్వే కదా అంటూ నిలదీశారు.
ఇదే సమయంలో తెలంగాణ ప్రజల ముందు రెండు కమిటీలు ఉన్నాయన్న సీఎం.. అందులో మొదటిది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్లతో కూడిన ‘కిలాడీ కమిటీ’ అని, రెండోది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘NDSA కమిటీ’ అని పేర్కొన్నారు. కిలాడీ కమిటీ చేసే బ్లాక్మెయిల్ రాజకీయాలకు, ఒత్తిళ్లకు తాము లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిపుణులతో కూడిన కేంద్ర ప్రభుత్వ సంస్థ NDSA (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) ఏది చెబితే తాము దాన్నే తూచా తప్పకుండా పాటిస్తామని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.