CM Revanth Reddy: రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత పటిష్టంగా ఉంటే, పెట్టుబడులు అంత వేగంగా వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీస్ అధికారుల రీట్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పోలీసు శాఖ గౌరవం ప్రజలకు అందించే సేవల్లోనే ఉందని గుర్తుచేశారు. నేరాలు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయని, ముఖ్యంగా సైబర్ నేరాలు వంటి భౌతికంగా కనిపించని నేరాలను కనిపెట్టడం పోలీసులకు ఒక పెద్ద సవాలుగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ టెక్నికల్ ఛాలెంజ్ను అధిగమించాలంటే అధికారులు ఎప్పటికప్పుడు తమ విజ్ఞానాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలని సూచించారు.
రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో తెలంగాణ అందిస్తున్న సహకారాన్ని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశ జనాభాలో కేవలం 2.5 శాతం ఉన్న తెలంగాణ, దేశ జీడీపీకి 5 శాతం వాటాను అందిస్తోందని ఆయన గర్వంగా చెప్పారు. భవిష్యత్తులో ఈ వాటాను 10 శాతానికి పెంచడమే తమ ప్రభుత్వ ఆశయమని వెల్లడించారు. శాంతిభద్రతలు బాగున్న చోటనే అభివృద్ధి సాధ్యమవుతుందని, తెలంగాణను ఆ దిశగా తీర్చిదిద్దే బాధ్యత పోలీసులదేనని ఆయన పేర్కొన్నారు. సమస్యను సరిగ్గా అర్థం చేసుకుంటే సగం పరిష్కారం దొరికినట్లేనని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రపంచ నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, ముంబయి ఎదుర్కొంటున్న సమస్యలను ఉదాహరణగా చూపుతూ.. పాలకులకు దూరదృష్టి లేకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో రేవంత్ రెడ్డి వివరించారు. ఢిల్లీలో కాలుష్యం, బెంగళూరులో ట్రాఫిక్, ముంబయిలో వరదలు వంటి సమస్యలు ప్రణాళికా లోపం వల్లే సంభవిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ను అటువంటి సమస్యల నుంచి కాపాడి, ఒక ప్రపంచ స్థాయి నగరంగా నిలబెట్టాలని ఆయన కోరారు. ప్రతి అధికారి తమకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేయాలని హితబోధ చేశారు.
పాలనలో క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ కీలకమని సీఎం అధికారులకు సూచించారు. ఉన్నతాధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో నిరంతరం టచ్లో ఉండాలని చెప్పారు. వారితో స్నేహపూర్వక వాతావరణంలో మెలిగి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని, అప్పుడే సమర్థవంతమైన ఫలితాలు వస్తాయని అన్నారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటూనే, ప్రజలకు స్నేహపూర్వక పోలీసు వ్యవస్థను (Friendly Policing) మరింత చేరువ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Read Also: అప్పుల్లో అన్నదాత.. ఏపీ, తెలంగాణల ర్యాంకులు ఎంతంటే ?