Rythu Bharosa Funds Release:తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఉగాది పండుగ వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన ‘రైతు భరోసా’ నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. రాష్ట్రంలోని సుమారు 73 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ తొలి విడతలో భాగంగా ఎకరం వరకు భూమి ఉన్న 24.32 లక్షల మంది రైతులతో పాటు మొత్తం లబ్ధిదారుల కోసం రూ. 3,590 కోట్లను విడుదల చేశారు. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో ఈ నగదు సోమవారం నుండి నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానుంది.
రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికను ప్రకటించింది. మొదటి విడత నిధుల విడుదల అనంతరం.. మరో ఇరవై రోజుల తర్వాత రెండో విడతలో రూ. 2,650 కోట్లు.. ఆ తర్వాత మూడో విడతలో రూ. 2,760 కోట్లను విడుదల చేయనున్నారు. వచ్చే 45 రోజుల్లోగా మొత్తం రూ. 9,000 కోట్లను విడతల వారీగా రైతుల ఖాతాలకు చేరవేస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని రైతుల్లో 24.32 లక్షల మందికి ఎకరం లోపు భూమి ఉండగా.. 48.68 లక్షల మందికి ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్నాయి. వీరందరికీ ప్రాధాన్యతా క్రమంలో సాయం అందుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
నిధుల విడుదల కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్మెట్టలో నూతనంగా నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. సుమారు 62 ఎకరాల విస్తీర్ణంలో రూ. 300 కోట్ల భారీ వ్యయంతో ఈ అత్యాధునిక ఫ్యాక్టరీని నిర్మించారు. దీనికి అదనంగా రూ. 80 కోట్లతో నిర్మించనున్న పామాయిల్ రిఫైనరీ ప్లాంట్కు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి రావడం వల్ల ఈ ప్రాంతంలోని ఆయిల్ పామ్ రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని భావిస్తున్నారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా.. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అప్పుల ఊబి నుంచి రైతులను గట్టెక్కించేందుకు ఇప్పటికే రుణమాఫీని విజయవంతంగా అమలు చేశామని.. ఇప్పుడు రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామని తెలిపారు.