CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాలను తేల్చాలంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ రాశారు. ఈ విషయమై చర్చించేందుకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయించాలని పట్టుబట్టారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు సంబంధించిన అంశాలు త్వరితగతిన పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇటీవల 16వ తేదీన రాసిన లేఖను తాజా లేఖలో సీఎం ప్రస్తావించారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఐఆర్ఎఫ్సీ నిధుల విడుదలకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారం, మెట్రో ఫేజ్-2 అమలు తదితర కీలక అంశాలను తాజా లేఖలో రేవంత్ వివరించారు. జూన్ 22, 23 తేదీలలో తాను న్యూఢిల్లీ పర్యటనలో ఉండనున్నట్లు కిషన్ రెడ్డికి తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సమావేశం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కోరారు. మీతో పాటు అశ్విని వైష్ణవ్ ని కలిసి మెట్రో రైల్ ప్రాజెక్ట్ గురించి చర్చించాలని భావిస్తున్నట్లు కిషన్ రెడ్డికి చెప్పారు.
Also Read: అయ్యబాబోయ్.. కూలర్లో దూరిన పాము.. చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఉన్నదని కిషన్ రెడ్డికి సీఎం గుర్తుచేశారు. పెండింగ్ అంశాలు సత్వరం పరిష్కారం కావాలని అభిలషించారు. అశ్వినీ వైష్ణవ్ తో చర్చించి మెట్రోకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా వివరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. చర్చలకు అవసరమైన సంబంధిత ఒప్పందాలు, ఇతర పత్రాల ప్రతులను కూడా వెంట తీసుకువస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమావేశ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుని, సమావేశానికి సంబంధించిన వివరాలను వీలైనంత త్వరగా తెలియజేయాలని లేఖలో కిషన్ రెడ్డికి సూచించారు.
Also Read: కర్నూలు గడ్డ.. బంగారం అడ్డా.. దేశం చూపు ఇప్పుడు ఏపీ వైపే!