Gold Reserves: దేశంలో బంగారం గనులు అనగానే మనకు మొదట గుర్తొచ్చేది కర్ణాటకలోని కోలార్ లేదా హుట్టి గనులు. కానీ, త్వరలోనే ఆ చరిత్ర మారబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా అవతరించడానికి వేగంగా అడుగులు వేస్తోంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతం.. బంగారం తవ్వకాలకు అడ్డాగా మారబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.
కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గ్రామంలో సుమారు 50 టన్నుల బంగారు నిల్వలను గుర్తించినట్లు ఏపీ గనులశాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. జొన్నగిరితో పాటు రామగిరి, జవ్వకుల, చిగురుకుంట, బిస్నాతం వంటి మరో నాలుగు ప్రాంతాల్లోనూ బంగారు నిక్షేపాలను గుర్తించినట్లు ఆయన స్పష్టం చేశారు. ‘మా అంచనా ప్రకారం ఒక్క జొన్నగిరిలోనే 50 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. కాబట్టి కొన్నేళ్ల తర్వాత దేశానికే అత్యధిక బంగారం సరఫరా చేసే రాష్ట్రంగా ఏపీ ఎదుగుతుందని గట్టి నమ్మకం ఉంది’ అని ఓ జాతీయ మీడియాతో ముకేశ్ కుమార్ మీనా చెప్పుకొచ్చారు.
దశాబ్దం క్రితమే జొన్నగిరి ప్రాంతంలో బంగారు నిల్వలు కనుగొనేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఇందులో 1500 ఎకరాల భూమినికి సైతం తవ్వకాలు, పరిశోధనల కేటాయించిందని చెప్పారు. అయితే ఇప్పటివరకూ 500 ఎకరాల్లో మాత్రమే అన్వేషణ జరిగిందన్నారు. అక్కడ దాదాపు 13 టన్నుల వరకు బంగారం నిల్వలు ఉన్నట్లు ముకేశ్ కుమార్ అంచనా వేశారు. మిగిలిన 1000 ఎకరాల్లో బంగారం అన్వేషణ ఇంకా ప్రారంభం కాలేదని.. అది పూర్తైతే ఒక్క జొన్నగిరిలోనే 50 టన్నుల వరకూ బంగారం నిల్వలు బయటపడవచ్చని చెప్పుకొచ్చారు.
Also Read: అయ్యబాబోయ్.. కూలర్లో దూరిన పాము.. చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!
అయితే భూమిలోని బంగారాన్ని వెలికి తీయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయమని గనులశాఖ కార్యదర్శి తెలిపారు. దీనికి కోసం అంతర్జాతీయ స్థాయి ప్రత్యేకమైన నైపుణ్యం అవసరమని అన్నారు. అందుకే ఏపీ ప్రభుత్వం.. బంగారాన్ని వెలికితీసే బాధ్యతను గ్లోబల్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న ప్రైవేటు భాగస్వామ్య సంస్థలకు అప్పగించాలని నిర్ణయించిందని ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. గతంలో ఒక టన్ను ముడి ఖనిజాన్ని తవ్వినప్పుడు 3 గ్రాముల స్వచ్ఛమైన పసిడి లభించేదని.. ప్రస్తుతం అది క్షీణించి గ్లోబల్ స్థాయిలో సగటున 1 గ్రాముకు చేరుకుందని పేర్కొన్నారు. ఒకవేళ టన్నుకు 0.8 గ్రాముల కంటే తక్కువ బంగారం లభిస్తే.. ఆ గనుల తవ్వకం ఏమాత్రం లాభసాటి కాదని అన్నారు. ఈ నెల చివరిలో సీఎం చంద్రబాబు జొన్నగిరి బంగారు గనుల ప్రాజెక్టును ప్రారంభిస్తారని ముకేశ్ కుమార్ మీనా తెలియజేశారు.
Also Read: రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షం.. అన్నదాత సుఖీభవపై.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు