CM Revanth Reddy: తెలంగాణ ఉద్యమ చరిత్రలో కవులు, కళాకారుల పాత్ర అజరామరమని, వారు ఈ గడ్డ ఆత్మగౌరవానికి ప్రతీకలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. అందశ్రీ సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ, తన మనసుకు అత్యంత దగ్గరి వాడైన అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సమాజం పైకి అమాయకంగా కనిపించినా, ఆధిపత్యం హద్దు మీరితే తిరగబడుతుందని, ఆ తిరుగుబాటుకు కవులే స్ఫూర్తినిస్తారని పేర్కొన్నారు. నాడు నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి బండి యాదగిరి గలం విప్పితే సర్కారు పీఠం కదిలిందని, అలాగే మలిదశ ఉద్యమంలో సీమాంధ్ర ఆధిపత్యంపై గద్దర్, అందశ్రీ, గోరటి వెంకన్న వంటి వారు తమ పాటలతో యుద్ధం ప్రకటించారని సీఎం కొనియాడారు.
బడికి వెళ్ళని సహజ కవి అందశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం ముక్కోటి గొంతుకలను ఏకం చేసిందని, ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేసిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ గీతానికి అధికారిక హోదా లభిస్తుందని నాలుగు కోట్ల ప్రజలు ఆశించారని, కానీ గత పాలకులు ఆ గీతాన్ని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కవి రాసే పెన్నుపై మన్ను కప్పితే అవి గన్నులై మొలకెత్తుతాయన్న నానుడిని నిజం చేస్తూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర గీతంగా ప్రకటించి సముచిత గౌరవం కల్పించామని తెలిపారు. పాఠ్యపుస్తకాల్లోనూ ఈ గీతాన్ని మొదటి అంశంగా చేర్చామని చెప్పారు.
ఉద్యమకారులను, కవులను గౌరవించుకోవడం ప్రభుత్వ బాధ్యత అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గద్దర్, అందశ్రీ వంటి వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించామని, స్మృతివనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉద్యమ సమయంలో సర్వం కోల్పోయిన తొమ్మిది మంది ప్రముఖ కళాకారులు, ఉద్యమకారులను గుర్తించి, సచివాలయం సాక్షిగా సన్మానించి, వారికి 300 గజాల ఇళ్ల స్థలాలను కేటాయించామన్నారు. అంతేకాకుండా, భారత్ ఫ్యూచర్ సిటీలో వారికి అద్భుతమైన ఇళ్లను నిర్మించి, వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తామని వెల్లడించారు.
దళిత సామాజిక వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. తన సొంత గ్రామంలో దళితుల ఆదరణ వల్లనే తాను ఈ స్థాయికి చేరానని గుర్తు చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడుతూ, దేశంలోనే తొలిసారిగా వర్గీకరణను అమలు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని సగర్వంగా ప్రకటించారు. దళితుల మధ్య ఉన్న అగాధాన్ని తొలగించి, వారిని ఏకం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దళితులు కేవలం చిన్న ఉద్యోగాలకే పరిమితం కాకూడదని, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లుగా ఎదిగి రాజ్యపాలనలో భాగస్వాములు కావాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడి తన మంత్రివర్గంలో 27 శాతం పదవులను (నలుగురు మంత్రులు) దళితులకు కేటాయించామని, స్పీకర్ పదవిని కూడా దళితుడికే ఇచ్చామని రేవంత్ రెడ్డి వివరించారు.
Read Also: Cockroach Coffee: బొద్దింకలతో రుచికరమైన కాఫీ, దీని టేస్ట్ ఎలా ఉంటుందో తెలిస్తే.. లొట్టలేస్తారేమో?