Hyderabad: తెలంగాణలో రేవంత్ కేబినెట్ ప్రక్షాళన దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల మూడు తర్వాత మార్పులు చేర్పులు కనిపించే అవకాశాలున్నాయి. ఈ మేరకు కీలక నేతలకు స్పష్టమైన సంకేతాలు వచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ నుంచి వెళ్లిన ప్రతిపాదనకు హైకమాండ్ సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి వెళ్లారు.
మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పార్టీ అగ్రనేతలతో ఆయన సమావేశం కానున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మధ్యాహ్నం ఢిల్లీకి రానున్నారు. ఆయనతో సాయంత్రం లేకుంటే రాత్రికి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు.
కేబినెట్లో మార్పులు చేర్పుల గురించి ప్రధానంగా చర్చించనున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పలువురికి ఉద్వాసన పలికే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి జాబితా ఎప్పటికే ఏఐసీసీ పెద్దలకు పంపినట్టు తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్తో చర్చల తర్వాత జాబితాకు ఆమోదముద్ర పడనుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోపు మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని సమాచారం.
హైదరాబాద్ నుంచి పలువురు నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డితోపాటు పలువురు నేతలున్నారు. మంత్రి కొండా సురేఖ అంశంపై అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉన్నట్లు టాక్. రేపు లేదా ఎల్లుండి ఆ అంశంపై క్లారిటీ రానుంది. అసెంబ్లీ సమావేశాల లోపు ఆ ఎపిసోడ్కు ఫుల్స్టాప్ పెట్టనుంది.
కొండాపై వేటు ఖాయమా? కేబినెట్ ప్రక్షాళనా? అనేదానిపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నడుస్తోంది. రేవంత్ పునర్వ్యవస్థీకరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు బెర్త్ ఖాయమంటూ టాక్ నడుస్తోంది. ఆయన స్థానంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రిని స్పీకర్గా నియమించాలని హైకమాండ్ ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పటికే సదరు మంత్రిని రేవంత్రెడ్డి పిలిచి మాట్లాడినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
మంత్రి కొండా సురేఖ అంశం ఏఐసీసీ పరిశీలనలో ఉంది. ఒకవేళ ఆమెపై వేటు వేస్తే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యేకు ఛాన్స్ రావడం ఖాయంగా చెబుతున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ను ఈసారి కేబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం లేకపోలేదు. మంత్రివర్గంలో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ లోటును ఆయనతో భర్తీ చేయవచ్చని అంటున్నారు.
ఒకవేళ అది జరిగితే బీసీ సామాజికవర్గానికి చెందిన ఓ మంత్రిని తప్పించి పీసీసీ చీఫ్గా నియమిస్తారనే వాదన లేకపోలేదు. సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి కోసం ముఖ్యమంత్రి ఈసారి సిఫార్సు చేస్తున్నట్టు చెబుతున్నాయి. ఒకవేళ స్పీకర్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే రంగారెడ్డి జిల్లా నుంచి ఆయనకు అవకాశం దక్కినట్టు అవుతుంది.
ALSO READ: చెరువులను మింగేసే వాళ్ల ఆటలు సాగవ్! అంబర్పేట్ వేదికగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి పదవి కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న సీనియర్ మంత్రుల శాఖల్లో మార్పులు కనిపించనున్నాయట. ఒకవేళ ఇస్తే.. వారికి ఎలాంటి శాఖలు ఇస్తారనది ఆసక్తికరంగా మారింది.