Ramchander Rao: రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ సమస్య తీవ్రతను ముఖ్యమంత్రికి వివరించేందుకు, విద్యార్థులు రాసిన లేఖలను నేరుగా అందజేసేందుకు తమకు తక్షణమే అపాయింట్మెంట్ ఇవ్వాలని ఆయన కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థి లోకం తీవ్ర ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తోందని లేఖలో రాంచందర్ రావు పేర్కొన్నారు. ఈ బకాయిల విడుదలపై ప్రభుత్వం నుంచి వస్తున్న స్పందన ఏమాత్రం ఆశాజనకంగా లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ సమస్యలను వివరిస్తూ రాసిన లేఖలను బీజేపీకి అందజేశారని, వాటిని ముఖ్యమంత్రికి స్వయంగా సమర్పించాలనుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రజాప్రతినిధులు, బీజేవైఎం నాయకులతో కలిసి సీఎంను కలవడానికి తగిన సమయం కేటాయించాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.
అంతకుముందు బర్కత్ పుర సిటీ బీజేపీ ఆఫీస్ లో రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై నల్ల రంగులు చల్లడం, నాయకుల నివాసాలను ముట్టడించేందుకు యత్నించడం, ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడులకు పథకరచన చేయడం కాంగ్రెస్ అనుబంధ విభాగాలైన ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ అవివేకానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఎక్కడో బిహార్లో కొద్ది రోజుల క్రితం జరిగిన ఘటనలను పట్టుకుని, అబద్ధాలు ప్రచారం చేస్తూ, సంబంధం లేని విషయాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాజీనామా డిమాండ్ చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, దేశ యువతను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందని రాంచందర్ రావు విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో విధానాలపై నిరసన తెలపడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదని, కానీ ప్రత్యర్థి పార్టీల కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై దౌర్జన్యాలకు దిగడం అత్యంత హేయమైన చర్య అని ఆయన హెచ్చరించారు. బీజేపీ సంయమనం పాటిస్తోందని, ఒకవేళ తమ కార్యకర్తలు తిరగబడి ధీటుగా సమాధానం చెబితే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రంలో రోడ్ల మీద కూడా తిరగలేరని హెచ్చరించారు. ఇకనైనా బీజేపీ కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తలపై దాడులకు యత్నించడం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
Also Read: ‘ప్రజాధనం తిన్న పందికొక్కు’.. కేసీఆర్పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు!
ఇదిలా ఉంటే ప్రధాని మోదీ రాజ్యాంగబద్ధ పదవుల్లో నిరంతరాయంగా 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్నారని రాంచందర్ రావు తెలిపారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని, సెప్టెంబర్ 17న ప్రధాని జన్మదినం నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా, అలాగే రాష్ట్రంలోని ప్రతి మండల స్థాయిలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లో కేవలం అధికార పోరాటమే కాకుండా సేవాభావం ప్రధానంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా మొక్కలు నాటడం, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, స్వచ్ఛ భారత్, రక్తదాన శిబిరాలు వంటి పలు సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
Also Read: రూ.8 లక్షల కోట్ల అప్పు.. ఇదే కేసీఆర్ మార్క్ పాలన: సీఎం రేవంత్