Moosarambagh Bridge:హైదరాబాద్ లో రోజూ పెరుగుతున్న ట్రాఫిక్ కి శాశ్వత చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నగరప్రజలు,ముఖ్యంగా తూర్పు హైదరాబాద్ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక మూసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జిని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఈరోజు ఘనంగా ప్రారంభించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో మూసీ నదిపై దాదాపు రూ.52 కోట్ల భారీ అంచనా వ్యయంతో 400 మీటర్ల పొడవునా ఈ అధునాతన వంతెనను నిర్మించారు. ఈ నూతన హై లెవల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో అంబర్పేట్ మరియు మూసారాంబాగ్ పరిసర ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు ఇకపై అత్యంత వేగంగా, సులభంగా జరగనున్నాయి..
నిజానికి ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే చాలు మూసీ నది ఉధృతంగా ప్రవహించి, పాత వంతెన నీట మునిగిపోవడం పరిపాటిగా మారిపోయింది. ఇక ఆ సమయంలో దానిపై ప్రయాణించే వారి బాధలు మాములుగా ఉండేవి కావు. మొత్తానికి ప్రయాణికులు ఎదుర్కొనే నరకయాతనకు, కిలోమీటర్ల మేర నిలిచిపోయే ట్రాఫిక్ జామ్లకు ఈ సరికొత్త వంతెన నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభించినట్టయింది అని చెప్పాలి .. ఇకపై ఎలాంటి భారీ వర్షాలు కురిసినా రాకపోకలకు ఆటంకం కలగకుండా, చాదర్ఘాట్, మలక్పేట్, దిల్ సుఖ్ నగర్ అంబర్పేట్ మార్గాల్లో ప్రయాణం ఈజీగా సాగనుంది.
హైదరాబాద్ పాతబస్తీతో పాటు తూర్పు, దక్షిణ నగర రోడ్డు కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంలో ఈ బ్రిడ్జి అత్యంత కీలక పాత్ర పోషించనుంది. ఈ రూట్లో రాకపోకలు సాగించే రోజూ వారి ప్రయాణికులకు మాత్రమే కాకుండా, బిజినెస్ చేసేవారికి, విద్యార్థులకి ,అక్కడున్న వారందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
ఇక చుట్టుపక్కల నివాస ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి రకమైన వాహనానికి ఎలాంటి ఆటంకం లేని “వంతెన వినియోగం లోకి రావడం తో అక్కడి ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇదే క్రమంలో మరో అత్యంత ప్రాధాన్యత కలిగిన నల్గొండ క్రాస్రోడ్స్ ఫ్లైఓవర్ ప్రాజెక్టు కూడా తుది దశకు చేరుకుని ప్రారంభానికి రెడీ అయిపొయింది.ఎన్నో ఏళ్లుగా . సాగుతున్న ఈ ఫ్లైఓవర్ ప్రధాన నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఈ అతిపెద్ద ఫ్లైఓవర్ కూడా త్వరలోనే అధికారికంగా వాహనదారులకు అందుబాటులోకి రానుంది.
ఇది కనుక పూర్తిస్థాయిలో ప్రారంభమైతే నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన చంచల్గూడ, సైదాబాద్, సంతోష్నగర్, ఐఎస్ సదన్, ఒవైసీ హాస్పిటల్, కంచన్బాగ్, చంపాపేట్తో పాటు సాగర్ రోడ్ వైపు వెళ్లే లక్షలాది మంది ప్రయాణికులకు భారీ ఊరట లభిస్తుందనే చెప్పాలి.
హైదరాబాద్ నగర మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఒకేసారి మూసారాంబాగ్ బ్రిడ్జి అందుబాటులోకి రావడం, నల్గొండ ఫ్లైఓవర్ తుది దశకు చేరుకోవడం నగరవాసులకు నిజంగా పండుగ లాంటి వార్త. జీహెచ్ఎంసీ చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమాలతో నగరంలోని ప్రధాన సెంటర్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గిపోవడంతో పాటు ఇంధన వినియోగం, ప్రయాణంలో వృథా అయ్యే సమయం కూడా చాలావరకు తగ్గనున్నాయి.
also read:రూ.8 లక్షల కోట్ల అప్పు.. ఇదే కేసీఆర్ మార్క్ పాలన: సీఎం రేవంత్
రాబోయే రోజుల్లో నగర మౌలిక వసతులను మరింత ఆధునీకరించి ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా ప్రతినిధులు తెలిపారు .