రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి మొదటివారంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం వార్డుల విభజన, ఓటరు జాబితాను సిద్ధం చేసింది. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పద్ధతితో జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు, స్వతంత్ర్య అభ్యర్థులకు గుర్తింపు పొందిన పార్టీ గుర్తులు కాకుండా వేరే గుర్తులను కేటాయించనున్నారు. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెలాఖరులో మేడారం జాతర ఉన్నందున ఓవైపు ఆ పనులు చక్కబెడుతూనే సీఎం రేవంత్ జిల్లాల పర్యటనకు పిలుపునిచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా పట్టణ స్థాయి ఓటర్లే ఉంటారు. అయితే, ఓటరు జాబితాలో ఈసారి మహిళలదే పై చేయి అని అధికారులు స్పష్టంచేశారు. మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు రేవంత్ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు తెలిసింది. మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకునేందుకు సర్కార్ టార్గెట్గా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. ఇక గ్రేటర్ కార్పొరేషన్లకు ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు ఉంటాయని తెలుస్తున్నది. అందుకే సీఎం రేవంత్ జిల్లాల పర్యటనలకు వెళ్తున్నట్టు తెలుస్తున్నది.
మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని సీఎం రేవంత్ ఇప్పటికే జిల్లా ఇన్ చార్జి మంత్రులను ఆదేశించారు. స్థానికంగా రెబల్స్ బెడద లేకుండా చూడాలని, గెలిచే అభ్యర్థులను బరిలోకి దింపాలని వ్యూహరచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక అభ్యర్థుల మధ్య సయోధ్యకు ప్రయత్నించాలని లేదంటే ఫలితాలపై ఎఫెక్ట్ ఉంటుందని సీఎం ముందుగానే ఎమ్మెల్యేలు, మంత్రులకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తున్నది. గత సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు మరల పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించినట్టు సమాచారం. ఇక జిల్లాల పర్యటనల్లో సీఎం రేవంత్ .. మెజార్టీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారని సమాచారం.
అంతకుముందు జిల్లాల్లో పెండింగ్ పనులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, నిధులు విడుదల చేయనున్నట్టు తెలుస్తున్నది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హతిఘాట్ గ్రామంలోని చనాక కొరాటా పంప్ హౌస్ ప్రారంభించనున్నారు. అనంతరం నిర్మల్ జిల్లా మామడ మండలం పొంకల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజీని ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేయనున్నారు. తరవాత నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు.ఈ పర్యటనలో సీఎం ఉమ్మడి జిల్లాలో మొత్తం రూ.386.46 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనుండగా అధికారులు సీఎం పర్యటన కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.రేపు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారని తెలుస్తున్నది. అభివృద్ధి పేరిట ఆయన ఎన్నికల్లో ఓట్లు అడగాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అలాగే బీఆర్ఎస్ అధికార పార్టీపై చేస్తున్న కుట్రలను తిప్పికొడతారని చర్చ జరుగుతున్నది.