YS Jagan Mohan Reddy: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త మందా సాల్మన్ (45) దారుణ హత్య రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. సాల్మన్ దారుణ హత్యకు గురైన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.
అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడటానికి గ్రామానికి వచ్చిన దళితుడైన సాల్మన్ను ఇనుప రాడ్లతో కొట్టి చంపడం అత్యంత దుర్మార్గమని జగన్ పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షతో చేసిన హత్యేనని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం నడుస్తోందని, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో అరాచకాలు సాగుతున్నాయని జగన్ ఆరోపించారు. “సాల్మన్ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారు? అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో కొట్టి హత్యచేస్తారా? పైగా సాల్మన్పైనే తప్పుడు ఫిర్యాదు పెట్టిస్తారా? ఇలాంటి దారుణాలు చేయడానికా మీరు అధికారంలోకి వచ్చింది?” అని చంద్రబాబును ప్రశ్నించారు.
“ఈ ఘటన ముమ్మాటికీ వైయస్సార్సీపీని భయపెట్టడానికి, కట్టడిచేయడానికి మీరు, మీ పార్టీవారి ద్వారా, కొంతమంది పోలీసులు ద్వారా చేస్తున్న, చేయిస్తున్న రాజకీయ హింసాత్మక దాడుల పరంపరలో భాగమే.” అని అన్నారు. సీఎం పదవిలో ఉండి ఇన్ని అరాచకాలకు పాల్పడతారా అని నిలదీశారు.
పిన్నెల్లి గ్రామంలో ఎమ్మెల్యే, పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రాణ భయంతో వందలాది వైఎస్ఆర్సీపీ కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. హింసను ప్రేరేపిస్తున్న వారు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, “ఏది విత్తుతారో అదే పండుతుంది” అని హెచ్చరించారు. బాధితుడు సాల్మన్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కాగా, అనారోగ్యంతో ఉన్న భార్యను చూసేందుకు గ్రామానికి వచ్చిన సాల్మన్పై జనవరి 12న ప్రత్యర్థులు ఇనుప రాడ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 15న ఆయన మృతి చెందారు. నిందితులపై హత్య (BNS 103) మరియు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, పిన్నెల్లిలో పోలీసులు 144 సెక్షన్ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
Read Also: చైనా మాంజాతో యమపాశం.. అమాయకుల ప్రాణాలతో చెలగాటం వద్దు.. సజ్జనార్ ఆవేదన!