Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ హస్తగతం అవుతుందా అనే పరిస్థితులు నెలకొన్నాయి. తండ్రీకొడుకులైన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వ్యూహాలతో అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో దూసుకుపోతుండగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం కారు పార్టీలో కలవరానికి కారణమైంది.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 24 వ వార్డులు ఉన్నాయి. అభ్యర్థుల ఉపసంహరణ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ వాతావరణం నెలకొనే ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు అంతుచిక్కని వ్యూహాలను రచించారు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఖరారు అయిన కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాదం రమేష్ తో పాటు మాజీ బూఆర్ఎస్ కౌన్సిలర్లు ఖాజాఖాన్, ఇసాక్, లక్ష్మి, నాయకులు తిరుమల్ యాదవ్, మోతీకుమార్, నసీర్, హమీద్, పెయింటర్ శ్రీను తదితర నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండు రోజుల క్రితం 15వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి తవిటి కవిత, భర్త నిరంజన్ తో పాటు కాంగ్రెస్లో చేరడం గులాబీ పార్టీలో ఆందోళన కలిగించింది.
Also Read: Euphoria సినిమా ఈవెంట్ స్పీచ్ మధ్యలో ఏడ్చేసిన భూమిక.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన హీరోయిన్!
రెండేళ్లుగా అధికారానికి దూరమైన ఆ పార్టీకి సర్పంచ్ ఎన్నికలలో కాస్త ఊరట లభించినా మున్సిపాలిటీ ఎన్నికలవేళ బీఫాంలి ఖరారైన అభ్యర్థులు, పట్టణ ముఖ్య నాయకులతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆశ్చర్యానికి గురి చేసింది మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. పట్టణంలో పార్టీ బలంగానే ఉన్నప్పటికీ నాయకత్వలేమి, పట్టణ నాయకుల్లో భవిష్యత్తులో రాజకీయ మనుగడ లేకపోవడం లాంటి అంశాలతో కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఇంకా మూడేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల తాము లబ్ధి పొందడంతో పాటు తమను నమ్ముకున్న అనుచరులు, ప్రజలకు ప్రయోజనం కలిగించాలనే తాపత్రయంతో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీకి పలు వార్డులో బలమైన అభ్యర్థులు లేకుండా పోయారు ఇది మున్సిపల్ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీకి అదనపబలాన్ని కలిగించింది.
ఫలితంగా ఈనెల 11వ తేదీన జరిగే ఎన్నికల కంటే ముందే సగానికి పైగా స్థానాల్లో దాదాపు కాంగ్రెస్ అభ్యర్థుల విజయం ఖాయమనే అంచనాల్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలను ఆలోచింపజేస్తుంది అధికార కాంగ్రెస్ అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలుపొందితే తమ వార్డులు అభివృద్ధి చెందడంతో పాటుగా సంక్షేమ పథకాలు అందడం సులువు అవుతుందని అభిప్రాయం ఓటర్లను ఆలోచింపజేస్తుంది. దీనికి తోడు నాగర్కర్నూల్ పట్టణం కాంగ్రెస్కు పెట్టని కోటగా ఉంటూ వస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీకే ఓటర్లు పట్టం కట్టారు. అలాగే గత మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ నాయకులు పట్టించుకోకున్నా 9 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్గా గెలుపొందడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పదవుల్లో ఉండడం, ఇద్దరి వ్యక్తిగత మంచితనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు దోహదంగా మారుతుంది.