Congress vs BRS: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ భాష, ప్రవర్తనపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నిప్పులు చెరిగారు.
రాహుల్ గాంధీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన ‘హౌలా’ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే నాయిని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “గతంలో మీ కుటుంబం మొత్తం వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్లు మొక్కలేదా? ఇప్పుడు ఆయన కాళ్లు పట్టుకున్న నువ్వు హౌలా అని మాట్లాడుతున్నావా?” అని ప్రశ్నించారు. కేటీఆర్ చిల్లరగాళ్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని, ఇలాగే మాట్లాడితే కుటుంబ బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.
కేటీఆర్కు సిగ్గు, శరం లేదని, ఆయనను బ్రోకర్, లఫుట్, దేశదిమ్మరి అనలేక కాదని, తాము కూడా బూతుల్లో పీహెచ్డీ చేశామని నాయిని ఘాటుగా వ్యాఖ్యానించారు. తాము తిడితే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందన్నారు. కేవలం సీఎం రేవంత్ రెడ్డి దయవల్లనే కేటీఆర్ బయట తిరుగుతున్నారని, లేదంటే ఎప్పుడో జైల్లో ఉండేవారని అన్నారు. రాహుల్ గాంధీకి తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేదంటే మరోసారి వరంగల్ వస్తే చెప్పులతో కొట్టి పంపిస్తానని ఎమ్మెల్యే నాయిని బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని దోచుకుని ఒక్కొక్కరు వెయ్యి కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు.
మరోవైపు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కూడా కేటీఆర్ తీరుపై మండిపడ్డారు. జనగామలో కేటీఆర్ మితిమీరి, మతితప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై విచక్షణ కోల్పోయి మాట్లాడితే ఊరుకునేది లేదని, ఇంకోసారి అలా మాట్లాడితే తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో ఓడిపోయి, సర్పంచ్ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతు అయినా కేటీఆర్కు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు.
పవిత్రమైన శాసనసభను ‘బూతుల సభ’ అంటూ కేటీఆర్ అగౌరవపరచడం ఆయన అహంకారానికి నిదర్శనమని సంపత్ అన్నారు. వ్యక్తిగత ద్వేషంతో రాజ్యాంగ వ్యవస్థలను కించపరుస్తున్నారని ఆరోపించారు. శాసనసభను అవమానించిన కేటీఆర్కు స్పీకర్ వెంటనే నోటీసులు జారీ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు