Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ పిలుపునిచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సీఎం రేవంత్రెడ్డి కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కొండల్ రెడ్డి ఫోన్ టాప్ అయినట్లు సిట్ గుర్తించింది. రేవంత్ రెడ్డితో పాటు కొండల్ రెడ్డి ఫోన్ కూడా టాప్ అయినట్లు గుర్తించారు. రేపు ఉదయం సిట్ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసును వీలైనంత త్వరగా కొలిక్కి తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పలువురికి నోటీసులు జారీచేసింది.
బీఆర్ఎస్ హయంలో పలువురి ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్టేషన్ లో కేసు నమోదు అయింది. రెండేళ్లు కావస్తున్న ఈ కేసు మాత్రం పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే మాజీ ఎస్ఐబీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, పలువురిని సిట్ సుధీర్ఘంగా విచారించింది.
తాజాగా మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్యలకు కూడా నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
మరో వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కూడా నోటీసులు జారీ చేసింది. తనయుడు మాధవరం కృష్ణారావు కుమారుడి ఫోన్ ట్యాప్ అయిందని గతంలో విచారణకు పిలిచారు సిట్ అధికారులు.
అయితే కృష్ణారావు తనయుడు సందీప్ రావు విదేశాలకు వెళ్లడంతో, కృష్ణారావుకు నోటీసులు అందించారు పోలీసులు. గతంలో ప్రణీత్ గ్రూపు కంపెనీలో డైరెక్టర్గా పని చేశారు సందీప్ రావు. ఆ కంపెనీ అందించిన సీయూజీ (CUG) నంబర్పై ట్యాపింగ్ జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైందని అధికారులు పేర్కొన్నారు. అయితే సందీప్ విదేశాలకు వెళ్లిపోవడంతో రెండో దఫా విచారణకు ఆయన అందుబాటులో లేకపోయారు. దీంతో తండ్రి కృష్ణారావుకు నోటీసులు అందజేసి, కుమారుడు భారత్కు తిరిగి వచ్చిన వెంటనే హాజరు కావాలని సూచించారు.
తాజా పరిణామాల మధ్య ఉదయం నుంచి వస్తున్న వార్తల నేపథ్యంలో.. మాధవరం కృష్ణారావు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసీ సజ్జనార్కు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిస్తోంది. అనంతరం సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం కృష్ణారావుకు నోటీసులు అందజేసింది. తన కుమారుడు విదేశాల్లో ఉన్నాడని, ఇండియాకి తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతాడని కృష్ణారావు పోలీసులకు లిఖితపూర్వకంగా తెలిపినట్లు సమాచారం.