MLC Venkat-KTR: మాజీ మంత్రి కేటీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్. ఆయన ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ అసలైన దోపిడీకి గురైందన్నారు. సీఎం రేవంత్రెడ్డిని విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు.
గురువారం హైదరాబాద్లో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్, కేటీఆర్కు హైదరాబాద్పై ఒక స్పష్టత లేదన్నారు. కేటీఆర్ చేసిన అక్రమాలకు ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో బావ, బామ్మర్దిలు కలిసి ఎన్నో స్కామ్లకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో అడ్డమైన జీవోలు ఇచ్చి ప్రభుత్వ భూములను ప్రైవేటు రంగానికి, బిల్డర్లకు ఇచ్చి డబ్బులు దోచుకోలేదా అంటూ ప్రశ్నించారు. కరీంనగర్ అక్రమ ఇసుక రవాణా చేసింది మీ తమ్ముడు, మీ బాబాయ్ కాదా, లిక్కర్ స్కామ్లో చెల్లి కవిత ఇరుక్కుని ఊసలు లెక్క పెట్టింది నిజం కాదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు.
చత్తీస్గడ్లో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల సంగతేంటి? అని అన్నారు వెంకట్. ఫోన్ టాపింగ్ విషయంలో ఆర్థిక, రాజకీయ అంశాలను చేర్చి దోపిడీకి తెరలేపింది కేటీఆర్ కాదా అంటూ ప్రశ్న వేశారు. ఐటీ రంగంలో హైదరాబాద్ను తామే అభివృద్ధి చేశామని ఒక బోగస్ ప్రచారానికి తెరలేపింది ఎవరని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో కేటీఆర్ చేసిన అవినీతి చిట్టాను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్నామన్నారు.
ALSO READ: కేంద్ర ఎస్టీ కమిషన్ ఎదుట.. వెలిమల భూముల వివాదం
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకొచ్చినా అది స్కామ్కు దారి తీసిందన్నారు వెంకట్. ఫార్ములా కేసులో ఏసీబీకి పూర్తిస్థాయిలో సహకరించి నిజాయితీని నిరూపించు కోవాలన్నారు. ఫార్ములా కేసులో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఆయనకు ఊరట లభించలేదన్నారు. ఇప్పుడు కేటీఆర్ కుటుంబాన్ని తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదని తేల్చేశారు ఎమ్మెల్సీ వెంకట్.