Chamala Kiran Kumar : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) పేరు మార్పు వ్యవహారం పార్లమెంట్లో దుమారం రేపింది. ఈ పథకం నుంచి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో దేశంలోని ప్రతి నిరుపేదకు కనీసం 100 రోజుల పని దినాలను కల్పించాలనే బృహత్తర లక్ష్యంతో, జాతిపిత మహాత్మా గాంధీ పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చారని ఆయన గుర్తుచేశారు. అయితే, ఆర్.ఎస్.ఎస్ (RSS) భావజాలంతో నడుస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం, పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం దారుణమని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం క్రమంగా నిర్వీర్యం చేస్తోందని ఎంపీ ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వమే 100 శాతం భరించేదని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ విధానాన్ని మార్చివేసిందని విమర్శించారు. కేంద్రం మరియు రాష్ట్రాల వాటాను 60:40 నిష్పత్తికి మార్చి, రాష్ట్రాలపై భారం మోపిందని ధ్వజమెత్తారు. పేదలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తెస్తే, నేటి బీజేపీ ప్రభుత్వం నిధులు తగ్గించి, పేరు మార్చి పథకాన్ని పూర్తిగా నీరుగార్చుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.