మాజీమంత్రి, సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు కొత్త చిక్కులు వచ్చినట్టు తెలుస్తున్నది. ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు అందుకు కారణమని సమాచారం. మొన్నటివరకు పార్టీలో సైలెంట్గా ఉన్న ఆయన..రెండ్రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ను జీఎచ్ఎంసీ విలీనంలో భాగంగా విభజిస్తారని ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే ఆయన అధికార పార్టీ మీద పలు విమర్శలు చేశారు. అది కాస్త అతి అయ్యిందని రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.బీఆర్ఎస్ నేతలు మాత్రం తలసాని కమ్ బ్యాక్పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన విమర్శల మీద మంత్రులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్కు అభివృద్ధి అంటే గిట్టదని ఫైర్ అవుతుండగా..కేసీఆర్ హయాంలో మెదపని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తున్నదని కూడా ప్రశ్నిస్తున్నారు. తలసాని మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆలోచించరా? అని నిలదీస్తున్నారు. గులాబీ హయాంలో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసినా కనీసం రోడ్లు కూడా రిపేర్ చేయించలేదని.. ఇప్పుడు నగర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే అడ్డొస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించడమే బీఆర్ఎస్ తన పనిగా పెట్టుకున్నదని కాంగ్రెస్ నేతలు విరుచుకపడుతున్నారు. హెచ్సీయూ భూముల వ్యవహారం నుంచి హిల్ట్ పాలసీ వరకు.. జీహెచ్ఎంసీలో మూడు కార్పొరేషన్ల ఏర్పాటు నుంచి భూముల కన్వర్షన్ వరకు ప్రతిపనికి గులాబీ నేతలు అడ్డుపడుతున్నారని గుర్తుచేస్తున్నారు. అసలు వీరికి అభివృద్ధి అవసరం లేదని, ప్రభుత్వ పనులకు అడ్డుతగలడమే వీరి ముఖ్య ఉద్దేశమని హస్తం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఫ్యూచర్ సిటీ మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు,పనులకు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఇలాగే అడ్డుతగిలిందా? అని అధికార పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.
గత పదేండ్లు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఆ టైంలో రెండు సార్లు తలసాని మంత్రిగా పనిచేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో పది జిల్లాలు ఉంటే దాన్ని 33 జిల్లాలుగా విభజించారు. జీహెచ్ఎంసీలో పలు మున్సిపాలిటీలను విలీనం చేశారు. అప్పుడు మౌనంగా ఉన్న తలసాని శ్రీనివాస్.. ఇప్పుడు హైదరాబాద్లో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామంటే మాజీ మంత్రి ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని అధికార పార్టీ నేతలు, మంత్రులు ప్రశ్నిస్తున్నారు.గత పదేండ్లలో తలసాని నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూపించి అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద, సీఎం రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు.లేదంటే విమర్శలు మానుకోవాలని,రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు. మరోవైపు కేసుల భయంతోనే తలసాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.