Hyderabad parks: ప్రాణ వాయువును అందించే పార్కుల కబ్జాలను హైడ్రా సీరియస్గా పరిగణిస్తోంది. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగి వాటిని రక్షిస్తోంది. ఇలా శుక్రవారం ఒకే రోజు.. ఒకే కాలనీలో 6 పార్కులను కాపాడి 2260 గజాల స్థలానికి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. మరో చోట 1152ల గజాలకు పైగా ఉన్న పార్కు స్థలాన్ని కబ్జాల నుంచి విడిపించింది. మొత్తం మీద 3041 గజాల విస్తీర్ణంలో పార్కులు అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. స్థానికులు పెద్దయెత్తున బయటకు వచ్చి పార్కుల కబ్జాలను తొలగించిన హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు. హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డుల ముందు ఫొటోలు దిగారు. భారీ ర్యాలీలు తీసి సంబరాలు చేసుకున్నారు. ఈ పార్కుల విముక్తికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఒకే కాలనీలో 6 పార్కులు..
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బులాలపూర్ మండలం, జీడిమెట్ల విలేజ్, సుభాష్ నగర్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీ లే ఔట్ను 1968లో వేశారు. 80 ఎకరాలలో 810 ప్లాట్లతో ఈ లే ఔట్ వేసి.. ఇందులో 10 పార్కులను కేటాయించారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడకు విద్యుత్ను అందించేందుకు వేసిన హైటెన్షన్ కరెంటు లైను ఈ లే ఔట్ మీదుగా వెళ్లింది. దీంతో హైటెన్షన్ విద్యుత్ లైన్ల కింద పలు పార్కులను అప్పటి లే ఔట్ వేసిన వారు కేటాయించారు. వేరే లైను ద్వారా పారిశ్రామిక వాడకు విద్యుత్ను అందించడంతో భాగ్యలక్ష్మి కాలనీ మీదుగా వెళ్లే హైటెన్షన్ వైర్లను 20 సంవత్సరాల క్రితం తొలగించారు. ఇక అక్కడి నుంచి ఆక్రమణలు జరుగుతున్నాయి.
స్థానిక అధికారులకు చెప్పినా ప్రయోజనం లేకపోయిందని అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు సంబంధిత శాఖలకు చెందిన వారితో హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో విచారించారు. పార్కు స్థలాలుగా నిర్ధారించుకున్నారు. శుక్రవారం వరుసగా ఉన్న 6 పార్కుల ఆక్రమణలను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేశారు. పార్కు స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడి కాలనీవాసులు సంబరాలు చేసుకున్నారు. బోర్డుల ముందు నిలబడి ఫొటోలు దిగారు. హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు. ర్యాలీలు తీసి సంబరాలు చేసుకున్నారు.
గుడిమల్కాపూర్లో పార్కు కబ్జాలకు విముక్తి..
హైదరాబాద్ జిల్లా ఆసిఫ్నగర్ మండలం గుడిమల్కాపూర్ గ్రామంలో ఏజీ ఆఫీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరుతో దశాబ్దాల క్రితం 10 ఎకరాల్లో 83 ప్లాట్లతో లేఔట్ రూపొందించారు. ఇందులో 79, 80, 81 నంబర్ల ప్లాట్లు గుంతల ప్రాంతంలో ఉండటంతో లేఔట్ను రివైజ్ చేసి.. ఆ ప్లాట్ల యజమానులకు ఇతర ప్రదేశాల్లో కేటాయింపులు చేశారు. గుంతలా ఉన్న సుమారు 1500 గజాల స్థలాన్ని పార్కుగా గుర్తించారు.అయితే గుంతను పూడ్చి పార్కు అభివృద్ధి చేయడంలో ఆలస్యం కావడంతో ఆ స్థలం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లింది. కాలక్రమేణా నిర్మాణాలు పెరగడంతో గుంతలను పూడ్చడం కూడా వారికి సులభమైంది.
తరువాత ఆ పార్కు స్థలాన్ని కొందరు అక్రమంగా ఆక్రమించారు. ఒకరు అక్కడ ఇసుక వ్యాపారం నిర్వహించగా.. మరొకరు వాహనాల పార్కింగ్గా వినియోగించారు. ఇంకొకరు కొబ్బరి బొండాల వ్యాపారం ప్రారంభించారు. ఈ పరిస్థితులపై ఆ ప్రాంత నివాసితులు 2018లో జీహెచ్ఎంసీని ఆశ్రయించి పార్కును రక్షించాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఈ విషయాన్ని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ఆ స్థలం పార్కుదేనని నిర్ధారించారు. శుక్రవారం ఆక్రమణదారులను ఖాళీ చేయించి సుమారు 1452 గజాల విస్తీర్ణంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి.. పార్కు స్థలమని సూచించే బోర్డులు ఏర్పాటు చేశారు.
Also Read: రికార్డు మెజారిటీలు.. ప్రజల ఆశీస్సులు.. కార్యకర్తలకు మంత్రి కృతజ్ఞతలు