Women Leaders: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ మహిళా వింగ్ యాక్టివ్ అయింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ దఫా సుమారు 50 సీట్లకు పైనే మహిళలకు కేటాయించే అవకాశం ఉన్నందున ఆశావహులు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన ఏఐసీసీ జాతీయ మహిళా అధ్యక్షు రాలు అల్కాలంబ సైతం వచ్చే ఎన్నికల్లో మహిళలకు భారీగా సీట్లు కేటాయించబోతున్నట్లు ప్రకటించారు. పైగా మహిళా కాంగ్రెస్ లో పనిచేసిన లీడర్లకే అత్యధిక ఛాన్స్ ఉంటుందని హింట్ ఇచ్చారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనికి సపోర్టు చేస్తూ ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న మహిళా లీడర్లు మరింత యాక్టివ్ అయ్యారు. ఇంత కాలం కేవలం పార్టీ ప్రోగ్రామ్స్ ను సక్సెస్ చేయాలనే ఉద్దేశ్యంతో పనిచేసిన మహిళా నేతలు, ఇక నుంచి సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రజలకు చేరువై, తమకు ప్రత్యేకమైన స్థానం, గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఈమేరకు వారికి అనుకూలంగా ఉండే నియోజకవర్గాలు, జిల్లాల్లో ప్రత్యేకంగా పర్యటనలు చేయాలని మహిళా నేతలు ఫిక్స్ అయ్యారు. త్వరలో తమ సత్తా చాటేందుకు స్టేట్ మహిళా లీడర్లలోని కొందరు ప్రత్యేకమైన స్ట్రాటజీని ప్రిపేర్ చేస్తున్నారు.
మహిళా కాంగ్రెస్ లో గతంలో పదవులు కాంపిటేషన్ భారీగా ఉండేది. కానీ ఈ దఫా పార్టీ పదవుల కంటే నియోజకవర్గాలు, జిల్లా ఇన్ చార్జ్ ల పదవులు ఇవ్వాలని మహిళా నేతలు పట్టుపడుతున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ, మెంబర్స్, ఎగ్జిక్యూటివ్, వైస్ ప్రెసిడెంట్లు , కో ఆర్డినేటర్లు వంటి పదవులేమీ అవసరం లేదని కొందరు మహిళా నేతలు తేల్చి చెప్తున్నారు. ఇప్పుడు నియోజకవర్గం, జిల్లా స్థాయి ఇన్ చార్జ్ పదవుల్లో పనిచేస్తే , రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం టిక్కెట్ పొందడం సులువేనని మహిళా నేతలు భావిస్తున్నారు. డీ లిమిటేషన్ కంటే ముందే కొందరు మహిళా నేతలు నియోజకవర్గాలు పరిస్థితిని బేరిజు వేసుకుంటూ తమ యాక్షన్ ప్లాన్ లను రచిస్తున్నారు. వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దిశగా అడుగులు పడుతున్న తరుణంలో, డీ-లిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) తర్వాత మహిళా నేతలకు భారీగా అవకాశాలు లభించనున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుండి 179కి పెరిగే అవకాశం ఉండటంతో, అందులో దాదాపు 50 స్థానాలకు పైనే మహిళలకు రిజర్వేషన్ ద్వారా వచ్చే ఛాన్స్ ఉన్నది. దీంతో కాంగ్రెస్ మహిళా నేతలు ఇప్పటినుంచే సీరియస్ గా గ్రౌండ్ వర్క్ కు సిద్ధమయ్యారు.
Also Read: Ysrcp : పార్లమెంటుకు రాజధాని బిల్లు.. ఇరకాటంలో వైసీపీ!
గతంలో స్టేట్ ఉమెన్ వింగ్ అధ్యక్షురాలిగా పనిచేసిన సునీతరావు తో పాటు మరి కొందరు మహిళా టీమ్ లీడర్లు ..ఈ దఫా‘ అధ్యక్షా’ అనాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోని తప్పిదాలు, నిర్లక్ష్యాలను ప్రశ్నించడంతో పార్టీ ఉమెన్ వింగ్ గట్టిగానే పనిచేసింది. నిత్యం గత ప్రభుత్వం పై నిరసనలు నిర్వహిస్తూ, ప్రజలను చైతన్యం చేయడంలో సునీతరావు అండ్ టీమ్ సంపూర్ణంగా పనిచేశారు. దీంతో ఆ టీమ్ లోని కొందరు ముఖ్య లీడర్లు ఈ దఫా నియోజకవర్గాల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలు కావాలని క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు సిద్ధపడ్డారు. మరోవైపు ఇక ఇప్పటికే మంత్రులుగా సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు పద్మావతి రెడ్డి, యశస్వినిరెడ్డి, పర్ణికారెడ్డి, ఎంపీ కడియం కావ్య తదితరులంతా పార్టీ కోసం చట్ట సభల్లో తమ వాయిస్ లు వినిపిస్తుండగా, రాబోయే రోజుల్లో తాము చట్టసభల్లోకి అడుగు పెట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి దామోదర రాజనర్సింహా కూతురు త్రిష, మంత్రి కొండా సురేఖ డాటర్ కొండా సుష్మిత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మీ, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి, మహిళా నేత ఇందిరా శోభన్ తదితరులంతా తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు రెడీ అయ్యారు.
Also Read: Secunderabad: బోయిన్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. క్షణాల్లో బూడిదైన కళ్లద్దాల షాపు!