Hyderabad: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సాయంత్రంలోగా మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కొండా సురేఖ డిసైడ్ అయినట్టు సమాచారం. ఈ విషయమై కాసేపట్లో మీడియా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి కాకుండా కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పేందుకు కొండా దంపతులు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలేం జరిగింది?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ ఎపిసోడ్కు కాసేపట్లో ఫుల్స్టాప్ పడనుంది. తనపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకునే లోపు మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు మంత్రి కొండా సురేఖ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధిష్ఠానం నిర్ణయం కంటే ముందుగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారట కొండా దంపతులు.
ప్రస్తుతం అనుచరులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రకటన చేయనున్నారు. సాయంత్రం ఐదు గంటల లోపు మీడియా ముందుకు వచ్చేందుకు కొండా దంపతులు రెడీ అవుతున్నట్లు ఆమె మద్దతు దారులు చెబుతున్నారు. కీలక నిర్ణయం తీసుకుంటామని అనుచరులతో కొండా దంపతులు తేల్చి చెప్పినట్టు సమాచారం. ప్రజలే తమ బంధువులు, వారి నిర్ణయం మేరకే భవిష్యత్ నిర్ణయం ఉంటుందని చెప్పారట.
రాజీనామా తర్వాత నెక్ట్స్ అడుగులు ఏంటన్న దానిపై కొండా దంపతులు మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ప్రజల అభిప్రాయం మేరకే తదుపరి రాజకీయ అడుగులు వేస్తామన్న సంకేతాలు ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. రాజీనామా తర్వాత కొండా దంపతుల అడుగులు ఎటు వైపు అన్నది ఆసక్తి నెలకొంది.
మీడియా సమావేశంలో కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై మీడియా ముందు చెప్పాలని డిసైడ్ అయినట్టు అంతర్గత సమాచారం. అంతేకాదు ప్రధానంగా బీసీ అంశాన్ని ప్రధాన ఎజెండాగా ప్రస్తావించాలని భావిస్తున్నారట.
ఢిల్లీలో ఏం జరిగింది? మంత్రి పదవికి రాజీనామా చేయాలని కొండా సురేఖకు పార్టీ అధ్యక్షుడు ఖర్గే తేల్చి చెప్పినట్టు ఢిల్లీ సమాచారం. ఒకవేళ రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేసేందుకు వెనుకాడమని అన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతా గురువారం సాయంత్రం నాటికి ఫుల్స్టాప్ పెట్టాలని ఇండికేషన్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
ఢిల్లీ నుంచి సాయంత్రం హైదరాబాద్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నారు. ఆ లోపు నిర్ణయాన్ని ప్రకటించాలని తేల్చిచెప్పారు హైకమాండ్ పెద్దలు. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించి ముందుగా రాజీనామా చేస్తే బాగుంటుందని సహచరులు ఆమెకు చెప్పినట్టు సమాచారం.