Miryalaguda: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనలో వైఫల్యాలను ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శిస్తూ, బాకీ కార్డులను ప్రజలకు పంపిణీ చేస్తూ ప్రజల్లోకి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ గా బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నెరవేర్చని హామీలను వివరిస్తూ గురువారం మిర్యాలగూడలో కేటీఆర్ రాక నేపథ్యంలో పట్టణంలోని రాజీవ్ చౌక్, ఫ్లైఓవర్ ఇతర ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ప్రత్యక్షమవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మిర్యాలగూడ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో దళితులకు మూడెకరాల భూ పంపిణీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీలో జాప్యం, పరీక్షల లీకేజ్, రైతు రుణమాఫీ లో ఆలస్యం, పోడు భూముల కు హక్కులు, కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్, డబల్ బెడ్ రూములు పంపిణీ, కాలేశ్వరంలో వివాదాలు అవినీతి ఆరోపణలు, ఫీజుల రియంబర్స్ మెంట్ బకాయిలు, కౌలు రైతులకు భరోసా పేరిట ఇచ్చిన హామీలన్నీ బీఆర్ఎస్ అమలు చేయలేదని అదేవిధంగా సచివాలయం ప్రవేశం పై ఆంక్షలు, ధర్నా చౌక్ ఎత్తివేత, ప్రతిపక్షాలు, కార్యకర్తలపై కేసులు, నిరుద్యోగులు, విద్యార్థులపై చర్యలు, ఆర్టీసీ సమ్మెపై ఉక్కుపాదం, సర్పంచులు రైతులపై కేసుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం చర్చగా మారింది.
Also read: వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ గరం
ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు మాజీ సీఎం కెసిఆర్ ఫోటోతో ఏర్పాటుచేసిన ఈ ఫ్లెక్సీల పై వాగ్దానాల అమలులో వైఫల్యం ప్రజాస్వామ్య హక్కుల పై ఆంక్షలు ఆరోపణలు, హామీలు ఎక్కడ ప్రజలకు న్యాయం ఎక్కడ నినాదాలతో మిర్యాలగూడలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మరో ఫ్లెక్సీ లో ‘మాట ఇచ్చాం మార్పు తెచ్చాం’ అన్న క్యాప్షన్ తో కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో రైతు రుణమాఫీ, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, ఇతర హామీలను ప్రస్తావిస్తూ ఏర్పాటైన ఫ్లెక్సీలపై చర్చ నడుస్తోంది.
బీఆర్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మిర్యాలగూడలో రైతు ధర్నాకు రానుండడం కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రశ్నించనున్న నేపథ్యంలో బీఆర్ ఎస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చలేదని పలు పథకాలను ప్రస్తావిస్తూ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల వెనుక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మిర్యాలగూడకు కేటీఆర్ రానున్న వేళ ఫ్లెక్సీల ఏర్పాటు వ్యవహారం కొత్త చర్చకు దారి తీసింది.
Also read: సీఎంగా రేవంత్ ఉన్నంతకాలం కేసీఆర్ అసెంబ్లీకి రారు.. కేటీఆర్ క్లారిటీ!