CPI Kunamneni: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో నడుస్తున్నది మాయా ప్రభుత్వమని, వారికి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అనేవి ఒక మిథ్య అని ఎద్దేవా చేశారు.
కోట్లాది మంది పేదల ఆకలి తీర్చే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు నుండి ‘మహాత్మా గాంధీ’ని తొలగించి, ‘జీ రామ్ జీ’ పేరు పెట్టడం క్షమించరాని నేరమని కూనంనేని మండిపడ్డారు. దేవుడిని దేవుడిలా, చరిత్రను చరిత్రలా చూడాలని, పథకం స్వరూపాన్ని మార్చి వ్యవసాయ కూలీల కడుపు కొట్టొద్దని హితవు పలికారు. దేశభక్తులమని చెప్పుకునే వారు దేశ ప్రజలను భక్షించే రాక్షసులా? అని నిలదీశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కూనంనేని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల పాటు ఫామ్హౌస్కే పరిమితమై, ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం తప్పులు చేయకుండా రెండేళ్లుగా ఎందుకు సూచనలు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని మంచి పనులు చేస్తున్నప్పటికీ, మహిళలకు రూ.2500, తులం బంగారం వంటి హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్లోబల్ సమ్మిట్లు, ఈవెంట్లు సామాన్యులకు ఎక్కవని, కమ్యూనిస్టులను విస్మరించిన చోట కాంగ్రెస్కు దెబ్బ పడిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
జనవరి 18న ఖమ్మంలో సీపీఐ వందేళ్ల పండగను (శతాబ్ది ఉత్సవాలు) ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అలాగే గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
Read Also: CM Revanth: సీఎం రేవంత్ భారీ గుడ్ న్యూస్.. చిన్న గ్రామాలకు రూ.5లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10లక్షలు