కొడంగల్ వేదికగా తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని, కేసీఆర్ ఇక రాజకీయంగా కోలుకోవడం అసాధ్యమని ఆయన సవాల్ విసురుతూ శపథం చేశారు.
100కి పైగా సీట్లు సాధిస్తాం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఎన్నికలపై స్పష్టమైన అంచనాతో సవాల్ విసిరారు. ఒకవేళ 2029లో ప్రస్తుతమున్న 119 నియోజకవర్గాలకే ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ను 87 సీట్లతో అధికారంలోకి తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగి 150 స్థానాలకు ఎన్నికలు జరిగితే.. 100కు పైగా స్థానాల్లో విజయం సాధించి తీరుతామని స్పష్టం చేశారు. ‘నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ అధికారంలోకి రావడం ఇక కలనే’ అని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కేసీఆర్ చరిత్ర ముగిసిపోయిందని కొడంగల్ సాక్షిగా రేవంత్ రెడ్డి శపథం చేశారు.
ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి…
కేవలం బయట విమర్శలు చేయడం కాదు.. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ‘పది మందిని వెనకేసుకుని పొంకనాలు కొట్టుడు కాదు.. అసెంబ్లీకి రండి, ఏ అంశంపై అయినా అర్థవంతమైన చర్చ చేద్దాం’ అని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా-గోదావరి జలాల పంపిణీ, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక అంశాలపై చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు.
కేటీఆర్ నీ లాగులో తొండలు విడిచి కొడతా..
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సొంత చెల్లెలి భర్త ఫోన్ను కూడా ట్యాపింగ్ చేశారని వాళ్లింటి ఆడబిడ్డే చెబుతోందని, సొంత కుటుంబానికే సమాధానం చెప్పుకోలేని కేటీఆర్ తనకు సవాల్ విసరడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతల బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘కేటీఆర్ నువ్వెంత.. నీ స్థాయి ఎంత..? ఆస్తి కోసం సొంత చెల్లిని మెడలు పట్టుకొని బయకు నెట్టేశావ్.. ఆమెకు సమాధానం చెప్పలేని వాడివి నాకు సవాల్ విసురుతవా..? నీ లాగులో తొండలు విడిచి కొడతా.. మీ నాయనను అడుగు నా గురించి చెబుతాడు. అమెరికాలో బాత్రూంలు కడిగినట్టు అనుకున్నావా.. నాతో మాట్లాడడం అంటే..’ అని సీఎం రేవంత్ రెడ్డి విరుచుకపడ్డారు.
బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మండిపడుతూ.. ‘తోలు తీస్తాం’ అనే మాటలకు భయపడబోమని, తమ తోలు సంగతి చూసుకోకముందే ప్రజలే మీ సంగతి చూస్తారని హెచ్చరించారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో భాగంగా కొడంగల్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి, తన సొంత గడ్డ మీద నుంచి కేసీఆర్ కుటుంబానికి బలమైన రాజకీయ హెచ్చరికలు జారీ చేశారు.
ALSO READ: CM Revanth: సీఎం రేవంత్ భారీ గుడ్ న్యూస్.. చిన్న గ్రామాలకు రూ.5లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10లక్షలు