రాష్ట్రప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా సత్యదూరమైన ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు ఎలా చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.అధికారానికి దూరం అయ్యాక బీఆర్ఎస్ వేస్తున్న ఎత్తులు అన్ని ఫెయిల్ అవ్వడంతోనే ఇటువంటి తప్పుడు ప్రచారాలతో ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. ఏదైనా ఆరోపణ అధికార పార్టీ మీద చేసే ముందు అందుకు తగిన సాక్ష్యాధారాలు ఉండాలి కదా? ఉంటే వాటిని మీడియా లేదా ప్రజల ముందు పెట్టి అప్పుడు ప్రశ్నించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రతినెలా ఢిల్లీకి కప్పం కడుతున్నాడని లేకపోతే ఆయన పోస్టుకు గండం తప్పదని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు పలుమార్లు విమర్శించారు. ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో ఢిల్లీ మూటలు మోయడం తప్పా రేవంత్కు ఏం తెలీదు అని ఆరోపిస్తుంటారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోసుకెళ్లేటప్పుడు మీరు చూశారా? ఆధారాలు ఏమైనా ఉన్నాయా? వీడియోలు, ఫొటోగ్రాఫ్స్ లాంటివి ఏమైనా ఉంటే చూపించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్నారు. ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని మండిపడుతున్నారు.రేవంత్ ఢిల్లీకి వెళ్లేది కేంద్రం వద్ద నిధులు అడగటానికి అని, రాష్ట్ర అవసరాల కోసం, అభివృద్ధి పనుల కోసం అనుమతులు,పెండింగ్ నిధులు రాబట్టడానికి వెళ్తున్నాడని సొంత పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు.
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ ప్రజల సొమ్మును రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చు కోసం పంపిస్తున్నాడని, అందుకోసం మంత్రులు సంచులు రెడీ చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ దందాలు, కమీషన్లు వసూలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు.గతంలో బిహార్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి ఫండ్స్ పంపించారని, త్వరలోనే కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు జరగబోయే ఎన్నికల కోసం మళ్లీ సంచులు రెడీ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు.అయితే, వాటికి సంబంధించిన ఆధారాల మీద ఆయన ఏమాత్రం మాట్లాడటం లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా నిధులు అందుతాయని, వాటితోనే ఎన్నికల్లో ఖర్చు పెడతారని, అభ్యర్థులు సైతం సొంతంగా ఖర్చు చేస్తుంటారని హస్తం నేతలు చెబుతున్నారు.
Addanki Dayakar MLC: బీఆర్ఎస్ నేతలు ‘మైకాసురులు’.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు.
ఇకపోతే బీఆర్ఎస్ నేతలతో పాటే బీజేపీ నేతలు నైతం రాష్ట్రంలో ఆర్ఆర్ (రాహుల్ ,రేవంత్ ) టాక్స్ను రియల్ ఎస్టేట్, కంపెనీల నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఇలాంటి ఆరోపణలు చేయడం విడ్డూరం. ఒకవేళ నిజంగా రాష్ట్రంలో అలాంటి టాక్సులు, ఢిల్లీకి గుట్టుగా మూటలు పంపిస్తే కేంద్రంలోని సీబీఐ, ఈడీ వంటి సంస్థలు ఏం చేస్తున్నాయని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. అర్థంపర్ధం లేని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చేందుకు ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని వదిలేసి కేవలం అసత్యప్రచారాలు చేయడం మానుకోవాలని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు హస్తం నేతలు హితవు పలుకుతున్నారు.