Addanki Dayakar MLC: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రతిరోజూ ఏదో ఒక అంశాన్ని తీసుకుని.. రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు హరీష్ రావు పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. గత పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల సొమ్మును పత్రికా ప్రకటనల రూపంలో దుర్వినియోగం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. పంజాబ్, మహారాష్ట్ర ఎన్నికల సమయంలో తెలంగాణ నిధులతో యాడ్స్ ఇచ్చింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చినప్పుడు దేశం మొత్తం పేపర్ యాడ్స్ ఇచ్చిన సంగతి హరీష్ రావుకు గుర్తులేదా అని నిలదీశారు.
కేసీఆర్ సంతోషంగా ఉంటే చాలు ప్రకటనలు ఇచ్చే సంస్కృతి బీఆర్ఎస్దని అద్దంకి దయాకర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావుకు ఎందుకు అంత అసూయ అని ప్రశ్నించారు. తాము ఇస్తున్న ప్రకటనలు కేవలం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించని.. ప్రజా ప్రయోజనాల కోసమేనని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హార్వర్డ్ స్కూల్ ఫీజును సొంత డబ్బులతో చెల్లించుకున్నారని.. బీఆర్ఎస్ నేతల్లా ప్రజా ధనాన్ని వాడుకోలేదని స్పష్టం చేశారు. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఇప్పుడు ‘గుమస్తా తెలంగాణ’ పత్రికగా మారిందని.. కేవలం ఒక వర్గానికి కొమ్ముకాస్తోందని ఆరోపించారు.
మూసీ ప్రక్షాళన చట్టాలను గతంలో కేటీఆర్ హయాంలోనే చేశారని.. ఇప్పుడు మళ్లీ మూసీ దగ్గరకు వెళ్లి లొల్లి చేయడం హాస్యాస్పదమని అద్దంకి పేర్కొన్నారు. గత పదేళ్లుగా విద్యార్థుల సమస్యలను పట్టించుకోని వారు ఇప్పుడు విద్యార్థుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటనలు ఇస్తే తప్పులేదు కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే తప్పా అని అడిగారు. పొద్దున్న లేస్తే మైకులు పట్టుకుని మాట్లాడే కేటీఆర్, హరీష్ రావులను ‘మైకాసురులు’ అని అభివర్ణించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం.. సంతకం పెట్టి వెళ్లిపోవడం మాత్రమే చేస్తున్నారని.. ఏ పనీ చేయకుండానే జీతం తీసుకుంటున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇటువంటి చౌకబారు విమర్శలకు దిగుతున్నారని చెప్పారు. గతంలో జరిగిన అవినీతి.. నిధుల మళ్లింపుపై ప్రభుత్వం త్వరలోనే పూర్తి వివరాలు బయటపెడుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా నిర్మాణాత్మకమైన విపక్ష పాత్ర పోషించాలని.. అనవసరంగా రాద్ధాంతం చేయడం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని.. ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని స్పష్టం చేశారు.