Ditwah Cyclone: భారత్ వైపు దిత్వా తుపాను దూసుకొస్తోంది. తుపాను వేగంగా తమిళనాడు–పుదుచ్చేరి తీరం వైపు కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంక తీరం సమీపంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోన్న దిత్వా.. ఉత్తర వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి తుపానుగా మారనుంది. రాగల 24 గంటల్లో తుపాను ఉత్తర- వాయువ్య దిశలో కదులుతూ.. రేపు ఉదయం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీర ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు(ఆదివారం) రాష్ట్రంలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం గత 6 గంటల్లో.. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్యం వైపు కదిలిందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయం 5.30 గంటలకు నైరుతి బంగాళాఖాతం ఆనుకొని ఉన్న ఉత్తర శ్రీలంకపై కేంద్రీకృతమైంది. జాఫ్నాకు సుమారు 80 కి.మీ, త్రించినమాలీకు 110 కి.మీ, కరైకల్ 190 కి.మీ, పుదుచ్చేరికి 300 కి.మీ, చెన్నైకు 400 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర-వాయువ్యం వైపు కదలడం కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
శ్రీలంకలో దిత్వా తుపాను విధ్వంసం సృష్టిస్తోంది. తుపాను కారణంగా భారీ వరదలు సంభవిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో కొండచరియలు విరిగిపడి 123 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.
తుపాను కారణంగా మృతి చెందిన వారికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. దిత్వా తుపాను బుధవారం శ్రీలంక తీరాన్ని తాకింది. తుపాను కారణంగా శ్రీలంక వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా విస్తృతంగా వరదలు, కొండచరియలు విరిగిపడ్డాయి.
కెలాని నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలలో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సాయుధ దళాలు హెలికాప్టర్లు, పడవలను ఉపయోగించి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. 43,995 మందికి పైగా ప్రజలను శ్రీలంక ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలించింది.
తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దిత్వా తుపాను కదులుతోందని ఐఎండీ అంచనా వేసింది. నవంబర్ 30న తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. తమిళనాడుకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read: Dithwa Cyclone: భారత్ వైపు దూసుకొస్తున్న దిత్వా తుఫాన్.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
రేపు తెల్లవారుజామునకు తీవ్రవాయుగుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శనివారం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.