High Court: హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ఉల్లంఘిస్తూ కూల్చివేతలు చేపట్టడంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసింది. శాంతశ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ను లంచ్ మోషన్ రూపంలో విచారించిన హైకోర్టు, కమిషనర్ రంగనాథ్ను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆయన కోర్టుకు వచ్చి స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
కోర్టు ఆదేశాలను ధిక్కరించడంపై సీరియస్..
సదరు నిర్మాణ సంస్థకు సంబంధించిన ఆస్తి విషయంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లోపలికి ప్రవేశించవద్దని తాము ముందే స్పష్టంగా చెప్పామని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ, హైడ్రా సిబ్బంది అక్కడకు వెళ్లడమే కాకుండా, సదరు యాజమాన్యంపైనే తిరిగి కేసులు పెట్టడం ఏంటని న్యాయమూర్తి మండిపడ్డారు. ‘మీకు కోర్టులపై నమ్మకం లేదా? బాధ్యతాయుతమైన పెద్ద అధికారులే ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా?’ అంటూ న్యాయస్థానం నిలదీసింది.
ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎలా వెళ్తారు?
హైడ్రా పనితీరుపై కోర్టులో తరచూ కోర్టు ధిక్కరణ పిటీషన్లు దాఖలవుతుండటాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. అనుమతి లేకుండా ఒకరి ప్రైవేట్ ప్రాపర్టీలోకి హైడ్రా అధికారులు ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించింది. వ్యవస్థలు తమ పరిధిని దాటి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది.
అధికారులపై కఠిన చర్యలు..
ఇలాంటి ధోరణి మున్ముందు కూడా కొనసాగితే, చట్టాన్ని ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)ని నేరుగా ఆదేశించాల్సి వస్తుందని హైకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ విచారణ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read: బంజారాహిల్స్లో భారీ చోరీ.. వాష్ రూమ్ కిటికీ పగలగొట్టి.. కిలో బంగారం ఎలా కొట్టేసారంటే?