Finance Delay: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక (ఫైనాన్స్) శాఖలో ఫైళ్ల కదలిక నత్తనడకన సాగుతోంది. నిధుల విడుదల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల పొడిగింపుల వరకు ప్రతి విషయంలోనూ ‘డిలే’ జరుగుతుంది. అత్యంత కీలకమైన అంశాల్లోనూ అధికారుల్లో సీరియస్నెస్ లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అలసత్వం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట మసకబారడమే కాకుండా, ప్రజారోగ్య వ్యవస్థ తీవ్ర చిక్కుల్లో పడింది.తాజాగా, కాంట్రాక్ట్ సర్వీసుల పొడిగింపునకు సంబంధించిన జీవో విడుదలలో జరుగుతున్న జాప్యం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనా ఆసుపత్రులలో తీవ్ర గందరగోళానికి, అనిశ్చితికి దారితీస్తోంది.
జీవో ఇంకా విడుదల కాకపోవడంతో రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్ల సేవలను కాలపరిమితి ముగిసిందనే నెపంతో అకస్మాత్తుగా నిలిపివేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వందలాది అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఉన్న కొద్దిపాటి అనుభవజ్ఞులైన కాంట్రాక్ట్ వైద్యుల సేవలను కూడా నిలిపివేయడం అత్యంత విచారకరం. ఈ కాంట్రాక్ట్ వైద్యులు నిరంతరంగా వైద్య విద్యను అందిస్తూనే, బోధనా ఆసుపత్రుల్లో రోగుల సేవల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. నిరుపేదలు నమ్ముకునే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీరి సేవలు అకస్మాత్తుగా ఆగిపోవడంతో వైద్య విద్య విద్యార్థులకు క్లాసులు, ప్రాక్టికల్స్ నిలిచిపోయాయి. అంతేగాక ఆసుపత్రి సేవల్లో ఆటంకం ఏర్పడ్డాయి. ఓపీ ,ఐపీ సేవలపై తీవ్ర ప్రభావం పడింది. వైద్యుల కొరతతో రోగుల చికిత్సలు ఆలస్యమవుతున్నాయి, అత్యవసర ఆపరేషన్లు వాయిదా పడుతున్నాయి.
Also read: Kavitha: మరోసారి బాయిబాట పట్టనున్న కల్వకుంట్ల కవిత.. నెక్ట్స్ టార్గెట్ ఈ నియోజక వర్గాలే..?
ఒకవైపు రెగ్యులర్ నియామకాలు లేవు.. మరోవైపు ఉన్న కాంట్రాక్ట్ వైద్యులను పొడిగించకుండా కాలయాపన చేస్తున్నారు. ఫైనాన్స్ క్లియరెన్స్ రాకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించింది. దీనివల్ల రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉన్నదని సీనియర్ వైద్య నిపుణుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని, వైద్య విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా కాంట్రాక్ట్ పొడిగింపు జీవోను వెంటనే విడుదల చేయాలని సీనియర్ డాక్టర్లు కోరుతున్నారు. అన్ని ఖాళీ పోస్టులకు పూర్తి స్థాయిలో రెగ్యులర్ నియామకాలు జరిగే అంతవరకు, ఎంతో కాలంగా అనుభవజ్ఞులైన ఈ కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలు వైద్య కళాశాలలకు అత్యంత అవసరమని వివరిస్తున్నారు.. వారి సేవల పొడిగింపులో ఫైనాన్స్ శాఖ అలసత్వం వహించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు.ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన ఫైళ్లను క్లియర్ చేయాలని ఓ సీనియర్ ప్రొఫెసర్ డిమాండ్ చేశారు.
Also read: South korea: హ్యుందాయ్ మోబిస్ విస్తరణకు ఏపీ మద్దతు.. సౌత్ కొరియాలో బిజీగా మంత్రి లోకేష్