Hate Speech: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ శాసనసభ, శాసనమండలికి సంబంధించి పలు కీలక కమిటీలను ప్రకటిస్తూ రాష్ట్ర శాసనసభ సచివాలయం సోమవారo రెండు వేర్వేరు బులెటిన్లను విడుదల చేసింది. 2026-27 సంవత్సరానికి గానూ వివిధ ఉమ్మడి కమిటీలు, అసెంబ్లీ, కౌన్సిల్ కమిటీల ఛైర్మన్లు, సభ్యుల నియామకంతో పాటు, అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల నియంత్రణ బిల్లు’ (హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ బిల్) పరిశీలనకు సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు.
గత మార్చి 30న అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం మేరకు ‘తెలంగాణ ద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరిత నేరాల (నివారణ) బిల్లు-2026’ (ఎల్.ఎ. బిల్లు నెం.20/2026) పరిశీలన కోసం స్పీకర్ ఒక సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. సభ్యులుగా బాలు నాయక్ నెనావత్, తోట లక్ష్మీకాంతారావు, గవినోళ్ల మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్), డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, యశస్విని మామిడాల, దానం నాగేందర్, కోవ లక్ష్మి, కోనింటి మాణిక్ రావు, రామ్ రావు పవార్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, కూనంనేని సాంబశివరావు ఉంటారు. ఈ సెలెక్ట్ కమిటీ రాబోయే 2026 వర్షాకాల సమావేశాల ముగింపు రోజున లేదా అంతకంటే ముందే తన నివేదికను సభకు సమర్పించాల్సి ఉంటుంది.
శాసనసభ, శాసనమండలి సభ్యులతో కూడిన 9 ఉమ్మడి కమిటీలను ప్రకటించారు. సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్గా కడియం శ్రీహరి నియమితులయ్యారు. ఈ కమిటీలో అసెంబ్లీ నుండి జగదీష్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలతో పాటు కౌన్సిల్ నుండి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పి. వెంకట్రామిరెడ్డి తదితరులు సభ్యులుగా ఉన్నారు.
Also read: ఈ 5 రకాల వ్యక్తులను పెళ్లి చేసుకోకూడదు.. లేకపోతే జీవితాంతం ఏడుపే
ఇక ఎస్సీ సంక్షేమ కమిటీ ఛైర్మన్గా మేడిపల్లి సత్యం వ్యవహరిస్తారు. ఈ కమిటీలో సభ్యులుగా తన్నీరు హరీష్ రావు, గోరటి వెంకన్న తదితరులు ఉన్నారు. అంతే గాక ఎస్టీ సంక్షేమ కమిటీ ఛైర్మన్గా పాయం వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. సభ్యులుగా టి. రాజాసింగ్, కోవ లక్ష్మి తదితరులు ఉన్నారు. బీసీ సంక్షేమ కమిటీ ఛైర్మన్గా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎంపికయ్యారు. సభ్యులుగా తలసాని శ్రీనివాస్ యాదవ్, తీన్మార్ మల్లన్న తదితరులు ఉన్నారు.
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు వృద్ధుల సంక్షేమ కమిటీ కి చిట్టెం పర్ణికా రెడ్డి ఛైర్పర్సన్గా వ్యవహరిస్తారు. సభ్యురాళ్లుగా సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, విజయశాంతి, వాణిదేవి తదితరులు నియమితులయ్యారు. మైనారిటీ సంక్షేమ కమిటీ ఛైర్మన్గా తోట లక్ష్మీకాంతారావు ఎంపికవగా, అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా లైబ్రరీ కమిటీ ఛైర్పర్సన్గా డాక్టర్ మట్టా రాగమయి నియామకం కాగా, అమినిటీస్ (సదుపాయాల)కమిటీ, వన్యప్రాణుల సంరక్షణ కమిటీ.. ఈ రెండు కమిటీలకు అసెంబ్లీ స్పీకర్ ఛైర్మన్గా వ్యవహరిస్తారు.
పిటిషన్ల కమిటీ, ప్రివిలేజస్ కమిటీ కి ఈ రెండింటికీ డిప్యూటీ స్పీకర్ ఛైర్మన్గా ఉంటారు. పిటిషన్ల కమిటీలో మల్లారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి సభ్యులుగా ఉండగా, హక్కుల కమిటీలో పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రభుత్వ హామీల కమిటీకి ఛైర్మన్గా పాటిల్ సంజీవరెడ్డి ఎంపికయ్యారు. గంగుల కమలాకర్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. రూల్స్ కమిటీ కి స్పీకర్ ఛైర్మన్ కాగా, సభ్యులుగా కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, అక్బరుద్దీన్ ఒవైసీ, కూనంనేని సాంబశివరావు తదితరులు ఉన్నారు.
Also read: Babar Azam: కోహ్లీ పెద్ద సెల్ఫీష్ ప్లేయర్, సొంత రికార్డుల కోసమే సెంచరీలు చేస్తాడు
ఎథిక్స్ (నైతిక విలువల) కమిటీ కి ఛైర్మన్గా రేవూరి ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. సభ్యులుగా వేముల ప్రశాంత్ రెడ్డి, టి. పద్మారావు తదితరులు ఉన్నారు. శాసనమండలి పిటిషన్ల కమిటీ హక్కుల కమిటీ కి కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ ఈ రెండింటికీ ఛైర్మన్గా వ్యవహరిస్తారు. హక్కుల కమిటీలో విజయశాంతి, శ్రవణ్ కుమార్ దాసోజు సభ్యులుగా ఉన్నారు.
ప్రభుత్వ హామీల కమిటీకి ఛైర్మన్గా కేతావత్ శంకర్ నియమితులయ్యారు. రూల్స్ కమిటీ కి కౌన్సిల్ ఛైర్మన్ దీనికి సారథ్యం వహిస్తారు. తీన్మార్ మల్లన్న తదితరులు సభ్యులుగా ఉన్నారు. సభ ముందుంచే పత్రాల కమిటీ (పేపర్స్ లైడ్ ఆన్ ద టేబుల్) ఛైర్మన్గా చల్లా వెంకట్రామిరెడ్డి ఎథిక్స్ కమిటీ ఛైర్మన్గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ నియామకాలకు సంబంధించి అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి, కౌన్సిల్ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహాచార్యులు అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తూ సభ్యులందరికీ సమాచారం అందించారు.
Also Read: అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు.. 38 మందికి మరణ శిక్ష.. అసలేం జరిగింది?