రైతుభరోసా వేసి రైతుల మనుసులు కొల్లగొట్టి.. వ్యతిరేకతను తగ్గించుకుందామని చూసిన కాంగ్రెస్ సర్కార్కు.. ఆ మైలేజీ దక్కకుండా చేయాలనుకున్నది బీఆరెస్. బోడి రెండెకరాల్లోపు వేసి చేతులెత్తేస్తారని విమర్శించాడు కేటీఆర్. అప్పులు లెక్కలు చూస్కుందాం రా అని రచ్చకెక్కి లొల్లి పెట్టాడు.
ఈ భరోసా నిధులు.. రైతులకు పెట్టుబడి సాయం ముచ్చట పక్కకు పోయింది. బీఆరెస్ లీడర్లు.. ఛాలెంజులు, సవాళ్లు.. అరెస్టులు..ఎక్కడ చూసినా వాళ్లే. రైతులు లేరు. భరోసా లెక్కలు లేవు. ఎంత మంది రైతుల సెల్ఫోన్లు టకీ టకీమన్నాయో తెలియదు. ఎన్ని పైసలు జమ అయినాయో తెలియదు.
ఇదిలా ఉండగానే.. మళ్లా కన్నెపల్లి పంప్హౌజ్ అని కొత్త ముచ్చట రానే వచ్చింది. అక్షరాల తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తున్నాం చూశారా? అని ఆ వేదిక మీద చెప్పడమే గానీ, రైతు పండుగను కాంగ్రెస్ వాళ్లు ఎంజాయ్ చేసింది లేదు. దీంతో బీఆరెస్ అనుకున్నది సాధించింది. రైతులకు భరోసా వేసినా.. కాంగ్రెస్కు మైలేజీ రాకుండా అడ్డుకున్నామని సంబరపడిపోయింది.
మొత్తానికి ఇది గ్రహించినట్టున్నారు. వెంటనే తేరుకున్నారు. ఏడు రోజులలో 7,500 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపాడు. అంతే కాదు..ఈ నెల 10న ఖమ్మంలో రైతు ఆశీర్వాద సభ కూడా పెడతామన్నాడు. మీరెంతగా దీన్ని డైవర్ట్ చేయాలనుకున్నా.. రైతులకు దగ్గరయ్యే ఇంత మంచి పథకం.. ఇంత కష్టకాలంలో.. ఏకకాలంలో అంత పెద్ద మొత్తం.. అంత మంది రైతుల ఖాతాల్లో వేసినంక.. ఢంకా బజాయించి చెప్పకపోతే ఎట్లా? బరాబర్ చెప్తాం..! ఇగ సూస్కోర్రి.. కాస్కోర్రి.. అని బీఆరెస్కు సవాల్ విసిరినట్టే ప్రకటన చేసింది సర్కార్.
గత నెల 30నే ఖమ్మంలో సభ పెట్టి రైతు భరోసా విడుదల చేయాల్సి ఉండే. కానీ వర్షాకాలం ఇబ్బంది అవుతుందని.. దాన్ని శిల్పాకళా రామం వేదికకు మార్చారు. కానీ సీఎం ప్రసంగమే గతి తప్పింది. రైతు పండగను ఆయన ప్రసంగమే పాడుచేసుకుని, ప్రతిపక్షాలకు అస్త్రాన్ని సమకూర్చాడు. అందుకే ఇది గతి తప్పి.. మతితప్పిన చాలెంజులకు ఉసిగొలిపి, రచ్చ రగిలించి.. చిచ్చు పెట్టి.. తొడలు చరుచుకుని, రోడ్లెక్కి.. తిక్క తిక్కగా తిట్టుకుని.. జనానికి కంపరమెత్తేలా చేసుకున్నారు.
తీరా తేరుకుని చూస్తే ఈ తతంగం వల్ల నష్టపోయింది.. బద్నామయ్యింది.. బురద జల్లించుకున్నది.. కాంగ్రెసేనని అర్థమయ్యింది. మైలేజీ రావడం దేవుడెరుగు.. అంతా మైనస్సే అయి కూర్చుంది. అందుకే దీన్ని చక్కదిద్దే పనికి మళ్లీ రేవంతే శ్రీకారం చుట్టాడు. ఖమ్మం సభ ద్వారా దీన్ని సరిదిద్ది.. రైతుల వద్ద తమ పరపతిని కాపాడుకుని, తమపై భరోసా పెంచేలా చేసుకుని, భరోసా నిధులకు ఢోకా లేదని భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నాడన్నమాట. మళ్లీ ఆ సభలో అన్యపదేశంగా పనికి రాని ప్రసంగాలు ఏమేమీ వచ్చిపడతాయో? అలవాటైన దోరణి కదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవే ప్రాణం పోశాయి. ఇప్పుడు మైలేజీకి బదులు మైనస్ మార్కులేస్తున్నాయి. ఇది గ్రహించాడో లేదో సీఎం సారు..!