Kavitha: స్వేచ్చ బ్యూరో: సింగరేణి బొగ్గు గనుల పరిధిలో తన పట్టును మరింత బిగించేందుకు, కార్మిక లోకానికి మరింత చేరువయ్యేందుకు తెలంగాణ రాష్ట్రసేన అధినేత్రి కల్వకుంట్ల కవిత మరోసారి ‘బాయిబాట’ పట్టబోతున్నారు. తన పార్టీ కేడర్ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ఆమె వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. తొలి విడుత బాయిబాట కార్యక్రమం అనూహ్యంగా విజయవంతం కావడంతో, పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. అదే జోష్తో సింగరేణి కోల్బెల్ట్పై పట్టు సాధించేందుకు కవిత రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 9వ తేదీ నుంచి రెండో విడత సింగరేణి పర్యటనకు సర్వం సిద్ధమైంది. మూడు రోజుల పాటు సాగనున్న ఈ టూర్లో మొత్తం 6 అసెంబ్లీ నియోజకవర్గాలను ఆమె చుట్టేయనున్నారు.
కేవలం రాజకీయ పర్యటనలా కాకుండా, పూర్తిగా సింగరేణి కార్మికుల శ్రేయస్సు, వారి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ పర్యటన సాగనుంది. సొంతిల్లు పథకం, వారసత్వ ఉద్యోగాల ప్రక్రియలో ఉన్న అడ్డంకులు, మెడికల్ అన్ఫిట్ కార్మికుల కుటుంబాలకు న్యాయం, గనుల్లో రక్షణ చర్యలు, వేతన ఒప్పందాల అమలు వంటి కీలక అంశాలపై కవిత నేరుగా కార్మికులతో చర్చించనున్నారు. యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై అక్కడికక్కడే వినతులు స్వీకరించేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే మెడికల్ బోర్డును ఈ నెల 20లోగా ప్రభుత్వం ప్రకటించకపోతే నిరవధిక నిరాహారదీక్ష చేస్తామని ప్రకటించారు. అందుకోసం కూడా కవిత సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం.
రెండో విడుత బాయిబాట కార్యక్రమానికి తెలంగాణ రక్షణసేన(టీఆర్ఎస్)పార్టీ షెడ్యూల్ ను సైతం ఖరారు చేసింది. ఈ నెల 9న నుంచి రెండో విడుత ప్రారంభమవుతుంది. ఈ నెల 8వ తేదీ రాత్రికి కొత్తగూడెం చేరుకొని 9న ఉదయం కొత్తగూడెంలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మధ్యాహ్నం ఇల్లెందుకు చేరుకుంటారు. 10న పినపాక, భద్రాచలం, 11న సత్తుపల్లి, ఆశ్వరావుపేట నియోజకవర్గాల్లోనూ పర్యటిస్తారు. ఒకవైపు బొగ్గుగని కార్మికులతో ముఖాముఖీ, మరోవైపు ప్రజలతోనూ సమావేశం కానున్నారు. సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. 3 రోజులు6 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. నేరుగా గనుల వద్దకు వెళ్లి కార్మికులతో మాట్లాడటం, వారి పని పరిస్థితులను పరిశీలించడం, బొగ్గు బావుల ఉపరితల ప్రాంతాల్లో గేట్ మీటింగ్లు నిర్వహించనున్నారు.
Also read: గురుకులంలో దారుణం.. పదో తరగతి విద్యార్థినికి కళ్లకు గంతలు కట్టి.. బలవంతంగా..!
తొలివిడుత బాయిబాటను 5 రోజులు 11 నియోజకవర్గాల్లో కవిత చేపట్టారు. ఒకవైపు సింగరేణి కార్మికులతో ముఖాముఖీ, మరోవైపు జెండా పండుగ, ప్రజలతో మమేకం, సమస్యలపై ఆరా, స్థానిక పరిస్థితులపై అధ్యాయనం చేశారు. గత నెల 15 నుంచి 20వ తేదీవరకు రామగుండం, మంథని, భూపాలపల్లి, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూరు,ఖానాపూర్, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో బాయిబాట కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమం విజయవంతో కార్మికుల్లో, పార్టీ శ్రేణుల్లోనూ నూతన ఉత్తేజాన్ని నింపింది.
గనుల్లోకి స్వయంగా వెళ్లి కార్మికుల కష్టనష్టాలను తెలుసుకోవడం, వారితో ముఖాముఖీ కార్యక్రమాలతో కవిత కార్మిక వర్గాలకు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ యాత్రకు వచ్చిన స్పందన చూసి టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంతో ఊగిపోతున్నాయి. దాంతో, అదే ఊపును కొనసాగిస్తూ రెండో విడుతను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కవిత భావిస్తోంది. ఈ పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లు, స్థానిక నాయకత్వంతో సమన్వయ బాధ్యతలను ఇప్పటికే నేతలు పర్యవేక్షిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మెజార్టీ బొగ్గుగన్నుల్లో పాగా వేయడమే లక్ష్యంగా కవిత వేస్తున్న ఈ అడుగులు సింగరేణి వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
Also read: Hate Speech: తెలంగాణ రాజకీయంలో కాక రేపుతున్న హేట్ స్పీచ్ సెలెక్ట్ కమిటీ.. సభ్యులు వీరే..!