Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాబోయే రోజుల్లో.. ప్రజల అవసరాలను పెద్ద ఎత్తున తీరుస్తామని స్పష్టం చేశారు. ప్రజల సంపదను ప్రజలకే పంచడం ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఒక్క పైసా కూడా దోపిడీదారుల కోసం కాదని స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. శనివారం పాలేరు నియోజకవర్గం అనంత నగర్లో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ను ప్రారంభించిన అనంతరం, మరో సబ్ స్టేషన్కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన విస్తృతంగా ప్రసంగించారు.
ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని, రాష్ట్రంలోని వనరులు, సంపద అన్నీ ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకే వినియోగిస్తామని భట్టి విక్రమార్క అన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజలను తాకట్టు పెట్టారని తీవ్ర విమర్శలు చేశారు. ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు తెచ్చి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయారని, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అల్లకల్లోలం చేశారని ఆరోపించారు. కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రజా సంక్షేమాన్ని ఎక్కడా ఆపలేదని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందుతోందని భట్టి వివరించారు. ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, తినడానికి సన్నబియ్యం, ఉండడానికి ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలుకు 500 రూపాయల బోనస్, వంద రోజుల ఉపాధి హామీ కూలీ, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంపు వంటి పథకాలు ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకొస్తున్నాయని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రత్యేకంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 ఇళ్ల చొప్పున నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 22,500 కోట్ల రూపాయల వ్యయంతో నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, వారం వారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లిస్తున్నామని వెల్లడించారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లను అవహేళన చేసిన వారు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేశారని కేసీఆర్పై తీవ్రంగా మండిపడ్డారు.
సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన ఉద్దేశం ప్రజల వనరులు ప్రజలకే అందాలన్నదేనని భట్టి గుర్తు చేశారు. కానీ గత పాలకులు ఆ ఆలోచనను విస్మరించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నిజమైన ప్రజా సంక్షేమం సాధ్యమైందని, అందుకే ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో.. 65 నుంచి 70 శాతం వరకు కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులే గెలిచారని చెప్పారు.
రైతుల సంక్షేమంపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నామని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. రూ.96 లక్షల కుటుంబాలకు ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 13,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని వివరించారు.
మహిళల సంక్షేమం ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల భారీగా నిధులు చెల్లిస్తోందని తెలిపారు. కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలుగా తొలి ఏడాదిలోనే 26 వేల కోట్ల రూపాయలు అందజేశామని చెప్పారు.
Also Read: బిగ్ టీవీ ఎఫెక్ట్.. మైరాన్కు రెరా నోటీసులు
పాలేరు నియోజకవర్గంలోనే 65 శాతం కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతోందని తెలిపారు. గత పాలకులు ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినా, ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ఎక్కడా తగ్గనివ్వదని, రాబోయే రోజుల్లో మరింత పెద్ద స్థాయిలో ప్రజల అవసరాలు తీర్చుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.