RERA action on Myron Group: మైరాన్ గ్రూప్ మోసాలపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో.. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) స్పందించింది. బిగ్ టీవీ వెలుగులోకి తెచ్చిన అంశాలను సీరియస్గా తీసుకున్న RERA, మైరాన్ సంస్థ ఎండీ యువరాజుకు నోటీసులు జారీ చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండానే మెగా మాల్ నిర్మాణం పేరుతో.. ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
బిగ్ టీవీ కథనాల ప్రకారం, మైరాన్ సంస్థ ప్రీలాంచ్ ఆఫర్ అనే ముసుగులో భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మెగా మాల్ నిర్మిస్తామని ప్రచారం చేస్తూ, భవిష్యత్తులో అధిక లాభాలు వస్తాయంటూ అమాయక ప్రజలను ఆకర్షించినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కనీస అనుమతులు కూడా లేవని, RERA వద్ద ఎలాంటి రిజిస్ట్రేషన్ జరగలేదని బిగ్ టీవీ తన కథనాల్లో స్పష్టంగా చూపించింది.
ఈ కథనాలపై స్పందించిన RERA సెక్రటరీ, మైరాన్ మాల్కు సంబంధించి ఇప్పటివరకు తమ వద్ద ఒక్క డాక్యుమెంట్ కూడా దాఖలు కాలేదని తెలిపారు. ఏ ప్రాజెక్టు ప్రారంభించాలన్నా ముందుగా RERA రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని గుర్తు చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో డబ్బులు వసూలు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
మైరాన్ సంస్థ ప్రచారం చేస్తున్న మెగా మాల్ ప్రాజెక్టుకు భూస్వామ్య వివరాలు, నిర్మాణ అనుమతులు, లేఅవుట్ ఆమోదం వంటి కీలక అంశాలపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయని RERA అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎండీ యువరాజుకు నోటీసులు జారీ చేసి, వారం రోజులలోగా పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
బిగ్ టీవీ వరుస కథనాలు ఈ వ్యవహారాన్ని ప్రజల ముందుకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి. సాధారణంగా ఇలాంటి ప్రీలాంచ్ స్కీమ్స్ ద్వారా రియల్ ఎస్టేట్ మోసాలు జరుగుతుంటాయని, చాలా మంది బాధితులు చివరకు నష్టపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. మైరాన్ వ్యవహారంలో కూడా అదే తరహా మోసం జరుగుతుందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
Also Read: అసలు మానవత్వం ఉందా..? నడిరోడ్డుపై గుండెపోటుతో కుప్పకూలిపోయినా..! చివరకు ఆయన నేత్రాలను..?
RERA జోక్యంతో అయినా బాధితులకు న్యాయం జరుగుతుందన్న ఆశ వ్యక్తమవుతోంది. ఇప్పటికే డబ్బులు చెల్లించిన పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. RERA తీసుకున్న చర్యలతో అయినా నిజాలు బయటకు రావాలని వారు కోరుకుంటున్నారు.