Bhatti Vikramarka: తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. ఈ రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మైనారిటీ, బీసీ సంక్షేమం, రహదారులు, భవనాలు, నీటిపారుదల వంటి పలు శాఖలపై నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్లతో కలిసి బడ్జెట్ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు.
సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల నిర్వహణపై డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్ భవనాల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, బిల్లులను వెనువెంటనే క్లియర్ చేస్తామని అధికారులకు భరోసా ఇచ్చారు. వసతి గృహాల్లో విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ కోసం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయాలని సూచించారు. కరెంటు భారం తగ్గించుకోవడానికి హాస్టల్ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, తద్వారా ఆదాయం కూడా సృష్టించుకోవచ్చని తెలిపారు. అధికారులు వసతి గృహాలను నిరంతరం పర్యవేక్షించాలని, వీలైతే రాత్రి వేళల్లో అక్కడే బస చేసి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం నియోజకవర్గ కేంద్రాల్లో ‘అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు’ ప్రారంభించనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లోని అత్యుత్తమ ఉపాధ్యాయులతో ఆన్లైన్ ద్వారా పోటీ పరీక్షలకు శిక్షణ ఇప్పించే ఈ విధానం దేశానికే మోడల్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుపేద విద్యార్థుల కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీసీ విద్యార్థులకు గ్రీన్ ఛానల్ ద్వారా స్కాలర్షిప్లు, డైట్ ఛార్జీలు విడుదల చేస్తున్నామని, త్వరలోనే మహిళలకు మహాలక్ష్మి కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా లక్ష కోట్లకు పైగా నిధులతో రహదారుల నిర్మాణం జరుగుతోందని డిప్యూటీ సీఎం వివరించారు. రీజినల్ రింగ్ రోడ్ (RRR), హైదరాబాద్-విజయవాడ వంటి ప్రధాన రహదారుల పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నీటిపారుదల రంగంలో రైతులు కేవలం వరిపైనే ఆధారపడకుండా పామ్ ఆయిల్, పప్పు ధాన్యాల వైపు పంట మార్పిడి చేసేలా ప్రోత్సహించాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సూచించారు.
నగరంలో సాంస్కృతిక వైభవాన్ని చాటేలా సంవత్సరం పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని సినిమాటోగ్రఫీ శాఖను డిప్యూటీ సీఎం ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లలో దశలవారీగా మోడల్ కిచెన్లను ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసేటప్పుడు ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యత పాటిస్తూ ప్రజా అవసరాలకు పెద్దపీట వేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు పాల్గొన్నారు.
Read Also: Balka Suman: బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా ఉస్మానియాలో సెగలు.. రేవంత్, వివేక్ దిష్టిబొమ్మల దహనం