Balka Suman: మాజీ ఎంపీ, మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా బిఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) భారీ ఎత్తున ఆందోళన చేపట్టింది. క్యాతన్ పల్లిలోని తన నివాసంలో ఉన్న సుమన్ గారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల విద్యార్థి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ నాయకత్వంలో ఓయూ ఎన్సిసి గేటు వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామిల చిత్రపటాలను దహనం చేశారు.
ఈ నిరసన సందర్భంగా శ్రీను నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార బలంతో ప్రతిపక్షాలను అణచివేస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ.. మంత్రి వివేక్ తన పదవిని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. అక్కడి మహిళా కౌన్సిలర్లను మానసికంగా.. శారీరకంగా హింసిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని.. వారికి అండగా నిలిచినందుకే బాల్క సుమన్ గారిని టార్గెట్ చేశారని ఆయన పేర్కొన్నారు.
పోలీసు వ్యవస్థను కాంగ్రెస్ నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని.. ప్రజాప్రతినిధులపై ఇలాంటి అక్రమ అరెస్టులు చేయడం దారుణమని శ్రీను నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి నశించాలని.. వెంటనే బాల్క సుమన్ గారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని ఏకం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థి నాయకులు, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Also Read:ఢిల్లీలో ఢీ.. గల్లీలో దోస్తీ? బీజేపీ ‘డబుల్ గేమ్’పై రాజకీయ రచ్చ!