Dharmapuri Arvind: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇద్దరి నాయకత్వ శైలిని ఎద్దేవా చేశారు.
కవితపై తీవ్ర వ్యాఖ్యలు
కవిత పరిస్థితి చూస్తుంటే జాలేస్తోందని అరవింద్ వ్యాఖ్యానించారు. తన పేరులోనే ధర్మం ఉందని కవిత చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఎన్నికల్లో కవితను ప్రజలు ఓడించడం అధర్మమా?’ అని ప్రశ్నించారు. ప్రజలే కాదు, ఆమె సొంత కుటుంబ సభ్యులే ఆమెను పక్కన పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్లో చేరతామంటే అక్కడా వద్దన్నారని, ఆఖరికి సొంతంగా వేరే పార్టీ పెట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.
పీసీసీ చీఫ్కు పాలనపై అవగాహన లేదు
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు పరిపాలన, ప్రజా సమస్యలపై కనీస అవగాహన లేదని అరవింద్ మండిపడ్డారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు కావడం నిజామాబాద్ జిల్లా బీజేపీకి నిజంగా ఒక బ్లెస్సింగ్ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
నిజామాబాద్ నుంచే పోటీ చేయాలి
వచ్చే ఎన్నికల్లో మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ నుంచే పోటీ చేయాలని తాము కోరుకుంటున్నామని అరవింద్ సవాల్ విసిరారు. పొలిటికల్ నాలెడ్జ్ లేని నేతలు కాంగ్రెస్, బీఆర్ఎస్ స్థానాల్లో ఉండటం బీజేపీ విజయానికి మరింత సులభం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: సూడాన్లో విషాదం.. కూలిన బంగారు గని.. 67 మంది దుర్మరణం!