బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల భయం పట్టుకున్నట్టు తెలుస్తున్నది. తాజాగా ఎన్నికల సంఘం ఓటరు వార్డు జాబితాను సిద్ధం చేసి డేటాను అందుబాటులోకి తెచ్చింది. దీనిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాను మరోసారి ప్రకటించనుంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండటంతో గులాబీ పార్టీ సైతం కసరత్తు ప్రారంభించింది. గత సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా కేడర్, నేతలను ఎన్నికలకు సిద్ధం చేసిన పనిలో నిమగ్నమైంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది.
ఈనెలాఖరు లేదా ఫిబ్రివరి మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని ప్రభుత్వం చెబుతున్నది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ గెలుపు గుర్రాల కోసం వెతుకుతున్నట్టు తెలుస్తున్నది. గులాబీ బాస్ ఫాంహౌస్ నుంచే కేటీఆర్, హరీశ్ రావులతో మాట్లాడుతూ వారికి దిశానిర్దేశం చేస్తున్నట్టు సమాచారం.గులాబీ పార్టీ అధికారానికి దూరం కావడంతో ఎన్నికల ఖర్చును భరించగలిగి, ప్రజలతో మమేకం అయ్యే వ్యక్తులను ఎంపిక చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. దీనికి తోడు ఏయే స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయో.. ఎక్కడ ఎవరిని నిలబెడితే సునాయాసంగా విజయం వరిస్తుందో అటు వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలని సైతం కేడర్ నుంచి అభిప్రాయాలు సైతం తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించాలంటే పార్టీ కీలక నేతలు, కేడర్ వార్డుల వారీగా ఏ ఇంటినీ వదలకుండా ప్రచారం నిర్వహించాలని పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో అందించిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరిస్తూనే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలపై చేసిన మోసం.. అదేవిధంగా ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షుణ్ణంగా వివరించాలని కిందిస్థాయి నేతలకు ఆదేశాలు అందినట్టు తెలుస్తున్నది. ఎవరైతే పార్టీ కోసం అనునిత్యం కష్టపడతారో ఈ ఎన్నికల్లో వారికే టికెట్లు ఇస్తామని సైతం పార్టీ నుంచి అభయం వెళ్లినట్టు కిందస్థాయి నేతల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున జిల్లాల వారీగా కేటీఆర్ సమావేశాలు నిర్వహిస్తూనే కేడర్, నాయకులను అప్రమత్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది.
Jagitial District: వేధింపుల తట్టుకోలేక, ఇంటికి వచ్చి టీచర్ సూసైడ్, అసలేం జరిగింది?
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయాలను చవిచూస్తునే వచ్చింది. ముందుగా కంటోన్మెంట్ ఉపఎన్నిక, ఆ తర్వాత జూబ్లీహిల్స్ బై పోల్.. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి పరాజయమే ఎదురైంది.వరుస ఓటములు ఆ పార్టీని మరింత కుంగదీస్తుండగా.. కేడర్ సైతం నిరాశకు లోనవుతున్నట్టు పార్టీలో చర్చ జరుగుతుంది. అందుకే పార్టీ పెద్దలు మున్సిపల్ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో సత్తా చాటి పార్టీకి ప్రజల్లో నమ్మకం పోలేదని..ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారనే మెసేజ్ పంపించాలని గులాబీ బాస్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వస్తే.. కిందిస్థాయి కేడర్లో జోష్ వస్తుందని, అది రెండేండ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగపడుతుందని పార్టీ అధిష్టానం ఆలోచన చేసినట్టు ప్రచారం జరుగుతోంది.