Etala Rajender: స్వేచ్ఛ బ్యూరో: గతంలో బీఆర్ఎస్ పై రెడ్ బుక్ రాస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, కానీ ఆయన అలా చేయలేదని, అందుకు బీజేపీ.. సీఎం రేవంత్ రెడ్డి అవినీతిపై రెడ్ బుక్ రాస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎన్ని లక్షల ఎకరాలు దోచుకున్నారో తాము అధికారంలోకి వచ్చాక పూర్తి లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ దోచుకున్నారని చెప్తున్న రేవంత్ రెడ్డి, మూడేళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే దీనిపై ఎంక్వైరీ చేయించి కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు.
ఆనాడు లేని బ్లాక్ లిస్ట్ ఈనాడు ఎందుకు..
కేసీఆర్ హయాంలో డబ్బులు దండుకున్న వాళ్లను రేవంత్ రెడ్డి ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తూ, ఆ సొమ్మును ఢిల్లీకి పంపిస్తున్నారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ తనను ఇబ్బంది పెడితే ప్రజలే ఆయనపై ఉమ్మేశారని, మూడేళ్లు అధికారంలో ఉండి కూడా తనపై మోపిన అభియోగాలను కేసీఆర్ నిరూపించలేకపోయారని గుర్తుచేశారు. సమైక్య రాష్ట్రంలో 22ఏ నిబంధన ఉన్నా ఎప్పుడూ ప్రజలు ఇబ్బంది పడలేదని, కానీ నేడు లక్షల మందికి నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆనాడు లేని బ్లాక్ లిస్ట్ ఈనాడు ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. సాక్ష్యాత్తు నిజాం వారసుడిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కాశీం రజ్వీ అరాచకాలతో నిజాం అనేక మందిని పొట్టన పెట్టుకున్నారని, ఆ నిరంకుశత్వం రేవంత్కు నచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే నాయకులకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారన్నారు.
భూదందాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల
ఎమ్మెల్సీ అంజిరెడ్డి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ భూదందా చిట్టా విప్పడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్బన్ సీలింగ్ యాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తీసుకొచ్చిందని గుర్తుచేసిన ఆయన.. తెలంగాణాలో ఒక్క ఎకరం ఎక్సెస్ ల్యాండ్ ఉన్నా ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేవలం మాటలు చెప్పడం కాకుండా చేతల్లో చూపించినప్పుడే భూ బాధితుల కోసం పనిచేశారని నమ్ముతామన్నారు. 22ఏ భూములపై సిట్టింగ్ జడ్జితో పూర్తిస్థాయి విచారణ చేపట్టిన తర్వాతనే రిజిస్ట్రేషన్లు, ల్యాండ్ ట్రాన్సాక్షన్లు జరగాలని డిమాండ్ చేశారు. పేద ప్రజల పక్షాన బీజేపీ నిరంతరం పోరాడుతుందని అంజిరెడ్డి స్పష్టం చేశారు.
Also Read: ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ హబ్.. యూకే వర్సిటీల ప్రతినిధులతో సీఎం రేవంత్ కీలక భేటీ