Etela Rajender: ఎంపీ ఈటెల రాజేందర్ కు కోపమొచ్చింది. అది కూడా అలా ఇలా కాదు.. ఏకంగా చేయి చేసుకున్నారు. ఈ విషయం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడు సౌమ్యంగా మాట్లాడే ఈటెల రాజేందర్ కు ఇంతలా ఆగ్రహం వచ్చింది ఎందుకో తెలుసా.. పేదల స్థలాలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కబ్జా చేశారనే సమాచారంతో ఇలా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
మేడ్చల్ జిల్లా పోచారంలో మంగళవారం బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బిజెపి నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్థానిక సమస్యలపై ఈటల ఆరా తీశారు. బిజెపి నాయకులు ఒక్కొక్కరిగా సమస్యలను వివరిస్తున్న క్రమంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్ల వ్యవహారం ఈటెల రాజేందర్ దృష్టికి వచ్చింది. ఏకశిలా నగర్లో పేదల భూములను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్రమంగా అక్రమిస్తున్నారని, అంతేకాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బిజెపి నాయకులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
Also Read: Whip Adi Srinivas: త్వరలో చీరలు పంపిణీ.. ఆర్డర్లన్నీ సిరిసిల్ల నేతన్నలకే
ఇక అంతే ఈటెల రాజేందర్ కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అక్కడే కదా రియల్ ఎస్టేట్ బ్రోకర్ని పిలిచి ఏకంగా చేయి చేసుకున్నారు. ఈటెల రాజేందర్ బ్రోకర్ చంప పగలగొట్టడంతో స్థానిక బిజెపి నాయకులు కూడా అదే తరహాలో అతనిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పేదల భూములను కబ్జా చేస్తే సహించేది లేదని, ఇటువంటి వారిని గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈటల డిమాండ్ చేశారు. ఎంపీ ఈటెల దాడికి పాల్పడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ వ్యవహారంపై ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.